నిర్భయ దోషులను వేర్వేరుగా ఉరి తీయాలన్న కేంద్రం పిటిషన్ ను పరిశీలించిన సుప్రీం ధర్మాసనం

  • నిర్భయ దోషుల ఉరి అమలు రెండు సార్లు వాయిదా
  • అసంతృప్తి వ్యక్తం చేసిన కేంద్రం
  • సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
  • ఈ నెల 11న విచారణ జరుపుతామన్న సుప్రీం
నిర్భయ దోషుల ఉరితీత ఇప్పటికిప్పుడు అమలు జరిగే సూచనలు కనిపించడంలేదు. ఇప్పటికే వారిపై జారీ అయిన డెత్ వారెంట్లు రెండుసార్లు వాయిదా పడ్డాయి. దీంతో కేంద్రం సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నిర్భయ దోషులు తెలివిగా వ్యవహరిస్తూ ఒకరి తర్వాత ఒకరు పిటిషన్లు దాఖలు చేస్తూ ఉరితీతను కావాలనే ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ, వారిని వేర్వేరుగా ఉరితీసేందుకు అనుమతించాలని పిటిషన్ ను వేసింది. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం నేడు పరిశీలించింది. దీనిపై మంగళవారం విచారణ జరుపుతామని తెలిపింది.

అయితే, నిర్భయ దోషులకు నోటీసులు జారీ చేయాలని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరగా అత్యున్నత న్యాయస్థానం అందుకు తిరస్కరించింది. నిర్భయ దోషుల ఉరితీత వ్యవహారం దేశ సహనాన్ని పరీక్షించేలా తయారైందని, ఇకనైనా వారిని ఉరితీసేందుకు అనుమతించాలని మెహతా కోర్టుకు విన్నవించారు. అటు, నిర్భయ దోషుల ఉరి అమలుకు కొత్త తేదీ ప్రకటించాలంటూ తీహార్ జైలు అధికారులు ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కాసేపట్లో విచారణ జరగనుంది.
Go Back to Shorts
Nirbhaya
Supreme Court
Death
Hang
NDA

More Telugu News