జగన్ పతనం ప్రారంభమైనట్టే.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

రాజధాని జోలికి వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కె.రామకృష్ణ హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధానిని మార్చేందుకు జగన్ కుట్ర పన్నారని ఆరోపించారు. రాజధానిపై వేసిన కమిటీలన్నీ బోగస్ అని కొట్టిపడేశారు. నిన్న చిలకలూరిపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

జగన్ రాజకీయ పతనం అమరావతి నుంచే ప్రారంభమైందని రామకృష్ణ అన్నారు. స్పీకర్ కూడా తన స్థాయిని మరిచి దిగజారి మాట్లాడడం దారుణమన్నారు. ఈ నెల 10న ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి కోసం నిపుణుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి అమరావతి అంశాన్ని తీసుకెళ్తామని తెలిపారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రం తీరుకు నిరసనగా ఈ నెల 8న దేశవ్యాప్త బంద్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.


More Telugu News