విశాఖలో దారుణం.. ఆస్తి తగాదాలతో భార్యను కొట్టి చంపిన భర్త

  • భార్యాభర్తల మధ్య ఆస్తి తగాదాలు
  • రోకలిబండతో కొట్టి చంపిన భర్త
  • పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలింపు
ఆస్తి తగాదాలతో ఉపాధ్యాయిని అయిన తన భార్యను దారుణంగా చంపేశాడో భర్త. విశాఖపట్టణం జిల్లా పాయకరావుపేటలోని చక్కానగర్‌లో నిన్న తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని నాగనరసింహ ప్రాథమిక పాఠశాల (మెయిన్)లో కె.మేరీ కమలక్ష్మి(48) టీచర్‌గా పనిచేస్తున్నారు. భర్త శోభన్‌రాజ్, కుమారుడు, కుమార్తెతో కలిసి చక్కానగర్‌లో నివసిస్తున్నారు.

భార్యపై అనుమానంతో పాటు ఆస్తి తగాదాలు కూడా ఉండడంతో భర్త శోభన్‌రాజ్ తరచూ భార్యను వేధించేవాడు. మంగళవారం రాత్రి తన ఇద్దరు పిల్లలను తీసుకుని చర్చికి వెళ్లి బుధవారం తెల్లవారుజామున మూడు గంటలకు తిరిగి ఇంటికొచ్చారు. నాలుగు గంటల సమయంలో భార్యతో మరోమారు గొడవకు దిగిన భర్త ఆగ్రహం పట్టలేక రోకలిబండతో తలపై బలంగా మోదాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను కుమారుడు, ఇరుగుపొరుగు వారు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె కన్నుమూశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Go Back to Shorts
Visakhapatnam District
wife
murder

More Telugu News