తెలుగుదేశం పార్టీని ప్రజలు ఓడించిన కారణం ఇదే... సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు!

  • అమరావతి నిర్మాణం ఆలస్యమైంది
  • కేంద్ర సంస్థలకు భూములిచ్చినా, నిర్మాణాలు జరగలేదు
  • విజయవాడలో మీడియాతో సుజనా చౌదరి
నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ఎంచుకుని, ఆపై నిర్మాణం విషయంలో ఆలస్యం చేసినందునే ప్రజలు తెలుగుదేశం పార్టీని ఓడించారని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, తెలుగుదేశం పార్టీ కొంప ముంచింది రాజధానేనని అన్నారు. కేంద్రానికి చెందిన 130 సంస్థలకు భూములను ఇచ్చినా, నిర్మాణాలు జరగలేదని చెప్పారు. అయితే అమరావతిలో ఎన్నో నిర్మాణాలు కొనసాగుతున్నట్టు చెప్పారు. విద్యాసంస్థలు మాత్రం రాజధానికి వచ్చాయని అన్నారు.

జగన్ 7 నెలల పాలనపై స్పందిస్తూ, ఈ ఏడు నెలల్లో అమరావతిలో ఒక్క పని కూడా జరగలేదని అన్నారు. గతంలో జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ, స్వాగతించారని గుర్తు చేసిన సుజనా చౌదరి, నాడు ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా అమరావతిని వ్యతిరేకించలేదని అన్నారు. రాజధాని నిర్మాణమంటే ఓ కారును వదిలేసి మరో కారు కొన్నంత సులువు కాదని, కోరుకున్న చోట భవనాన్ని నిర్మించుకుంటే సరిపోదని అన్నారు.

రాజధానిని ఎందుకు మార్చాలని అనుకుంటున్నారన్న ప్రశ్నకు ఇంతవరకూ జగన్ సమాధానం చెప్పలేదని సుజనా చౌదరి ఆరోపించారు. అసలు జీఎన్ రావుతో కమిటీని ఎందుకు వేశారో కూడా చెప్పలేదని, మూడు రాజధానులు అన్న మాట హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. అధికార వికేంద్రీకరణను వదిలేసి అభివృద్ధి వికేంద్రీకరణపై దృష్టిని పెట్టాలని, వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పాలని సలహా ఇచ్చారు.
Go Back to Shorts
Sujana Chowdary
Telugudesam
Amaravati
Vijayawada

More Telugu News