ఆర్టీసీ సమ్మెకు ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో కేసీఆర్!
- 50 రోజులకు పైగా సాగిన సమ్మె
- పట్టు వీడిన కార్మిక సంఘాలు
- ఓ మెట్టు దిగనున్న తెలంగాణ ప్రభుత్వం!
కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు కొన్ని విధి విధానాలు ఖరారు చేయాలని కేసీఆర్ సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం 28న ప్రత్యేక క్యాబినెట్ భేటీని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వ పరం చేయాలన్న డిమాండ్ ను శాశ్వతంగా వదిలేయాలని, ఆపై నిర్దిష్ట కాలం పాటు మరోసారి సమ్మెకు దిగకుండా సంఘాలు, ఉద్యోగులతో సంతకాలు చేయించాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదే సమయంలో ఆర్టీసీ సమ్మెపై పలు కేసులు కోర్టులో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో అవి పరిష్కారం అయ్యేంతవరకూ వేచి చూడాలన్న అంశంపైనా చర్చ జరగనుంది. అయితే, ప్రయాణికుల ఇబ్బందులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల రవాణా సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం కూడా ఓ మెట్టు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్యాబినెట్ సమావేశం రెండు రోజులు జరుగుతుందని, 29వ తేదీన తుది నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.