మళ్లీ తెరపైకి చంద్రబాబు ఆస్తుల కేసు.. లక్ష్మీపార్వతి పిటిషన్పై విచారణకు ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్
- ఈ నెల 25కు విచారణ వాయిదా
- 2005లో చంద్రబాబుకు స్టే
- సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో విచారణ ప్రారంభం
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని, ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరుతూ 2005లో లక్ష్మీపార్వతి ఏసీబీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, కేసు విచారణ ప్రారంభానికి ముందే చంద్రబాబు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తూ 2005లో స్టే విధించింది.
సివిల్, క్రిమినల్ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించి ఉండకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తాజాగా, చంద్రబాబు ఆస్తుల కేసు ఏసీబీ కోర్టు ముందుకు వచ్చింది. హైకోర్టు ఇచ్చిన స్టే కొనసాగుతోందని విచారణ సందర్భంగా చంద్రబాబు తరపు లాయర్ వాదించారు. అయితే, సుప్రీం తీర్పు ప్రకారం స్టే ఆరు నెలలకు మించి చెల్లదని లక్ష్మీపార్వతి తరపు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి 2005 తర్వాత స్టే పొడిగింపు లేని కారణంగా విచారణ ప్రక్రియ తిరిగి ప్రారంభం అవుతుందని తెలిపారు.