గోదావరికి వరద పోటు...పరీవాహక ప్రాంత ప్రజల్లో ఆందోళన
- భయం గుప్పిట కోనసీమ వాసులు
- ఇటీవల వరద విలయతాండవంతో భారీ నష్టం
- ఆ పరిస్థితులు జ్ఞాపకం తెచ్చుకుని టెన్షన్
గోదావరికి వరద పోటెత్తుతుండడంతో పరీవాహక గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. కొన్నిరోజుల క్రితమే గోదావరి ఉగ్రరూపంతో తీవ్రంగా దెబ్బతిన్న ఈ ప్రాంతవాసులు మళ్లీ తమ ప్రాణాల మీదికి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. గోదావరిలో నీటి ప్రవాహం పెరగడంతో జిల్లాలోని పి.గన్నవరం మండలం చాకలిపాలెం సమీపంలోని కాజ్వేపై వరద జోరుగా ప్రవహిస్తోంది. కనకాయలంక ప్రజలు నాటు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. కోనసీమలో వశిష్ఠ, వైనతేయ, గౌతమి, గోదావరి నదీ పాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో సహాయక చర్యలు ప్రారంభించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.