అమ్మకానికి తెచ్చిన దుస్తులను వరద బాధితులకు ఇచ్చేసిన వ్యాపారి!
- ఎర్నాకులంలోని ఓ వ్యాపారి త్యాగం ఇది
- ఈద్ మార్కెట్ కోసం కొత్త స్టాక్ తెప్పించిన నౌషద్
- బాధితుల కడగండ్లు చూడలేక వితరణ
వరదలు ముంచెత్తడంతో కట్టుకోవడానికి దుస్తులతో పాటు, నిలువనీడ కోల్పోయి అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. బాధితులను ఆదుకునేందుకు నటుడు రాజేష్ శర్మ ఆధ్వర్యంలో కొంతమంది స్వచ్ఛంద సేవకులు సహాయ సామగ్రిని సేకరించి మలబార్ ప్రాంతానికి పంపుతున్నారు. ఈ విషయం నౌషద్ కు తెలిసి వెంటనే ఆ స్వచ్ఛంద కార్యకర్తలను తన దుకాణానికి రమ్మన్నాడు. అమ్మకాల కోసం తెప్పించిన ఐదు బస్తాల కొత్త దుస్తులను వారికి విరాళంగా ఇచ్చేశాడు.
నౌషద్ ఔదార్యం చూసి స్వచ్ఛంద కార్యకర్తలు విస్తుపోయారు. అనంతరం అతన్ని అభినందనలతో ముంచెత్తారు. నిన్న జరిగిన ఈ ఘటనను ఫేస్బుక్లో రాజేష్ పోస్ట్ చేశాడు. అంతే.. నౌషద్పై నెటిజన్లు ప్రశంసల జల్లులు కురిపించారు. అంతేకాదు వరదలు తగ్గుముఖం పట్టాక నౌషద్ను కలుస్తామంటూ పలువురు ప్రముఖులు పోస్ట్ చేయడం గమనార్హం. దీనిపై నౌషద్ స్పందిస్తూ 'బక్రీద్ పండుగను ఇలా జరుపుకోవడం ఎంతో తృప్తిగా ఉంది' అన్నాడు.