మద్యం మత్తులో కారుతో బీభత్సం.. నిందితుడు ఐఏఎస్ అధికారి!
- ప్రమాదంలో ఒకరి మృతి
- సర్వే డైరెక్టర్గా పనిచేస్తున్న బాధ్యుడు
- తాను కారు నడపలేదని పోలీసులకు వాంగ్మూలం
అతనో బాధ్యతగల ఐఏఎస్ అధికారి. పలువురికి ఆదర్శంగా ఉండాల్సిన ఆయనే మద్యం సేవించి కారు నడపడమేకాక, దాంతో ఓ మోటారు సైక్లిస్ట్ను ఢీకొట్టి అతని మరణానికి కారణమయ్యాడు. చనిపోయిన వ్యక్తి ఓ పాత్రికేయుడు కావడం విశేషం. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సర్వే విభాగం డైరెక్టర్గా పనిచేస్తున్న శ్రీరామ్ వెంకట్రామన్ మద్యం మత్తులో కారును వేగంగా నడుపుతూ వచ్చి బైక్పై ఉన్న సిరాజ్ పత్రిక బ్యూరో చీఫ్ కె.ఎం.బషీర్ను ఢీకొట్టాడు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమయంలో కారులో ఓ మహిళ కూడా ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. అయితే ఘటన జరిగిన సమయంలో తాను కారు నడపడం లేదని పోలీసులకు వెంకట్రామన్ చెబుతున్నారు. దీంతో పోలీసులు సీసీ టీవీ పుటేజీని పరిశీలించి నిందితుడిని గుర్తించాలని నిర్ణయించారు.