Andhra Pradesh: ‘ప్రజావేదిక’ కూల్చివేత వ్యవహారం.. సీఎం జగన్ పై మండిపడ్డ గోరంట్ల బుచ్చయ్య చౌదరి!

అమరావతిలో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను కూల్చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ప్రకటించిన సంగతి తెలిసిందే. రేపు కలెక్టర్లతో రెండో రోజు సదస్సు ముగియగానే ఈ కూల్చివేత ప్రారంభం అవుతుందని ఆయన స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా మండిపడ్డారు.

ప్రజావేదిక అన్నది ప్రజల అవసరాల కోసం నిర్మించిన భవనం అని ఆయన తెలిపారు. అలాంటి ప్రజావేదికను కూల్చేస్తామని ఏపీ సీఎం జగన్ చెప్పడం సరికాదని వ్యాఖ్యానించారు. ప్రజావేదికను కూల్చేస్తామని చెబుతున్న వ్యక్తి అసలు అందులో సమావేశాన్ని ఎందుకు పెట్టాడని ప్రశ్నించారు. ప్రజావేదిక ప్రాంతం గత 50 ఏళ్లలో ఎప్పుడూ ముంపునకు గురికాలేదన్నారు. కరకట్టపై ప్రజావేదికతో పాటు చాలా కట్టడాలు ఉన్నాయనీ, వాటిని కూడా తొలగిస్తారా? అని నిలదీశారు.

ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవినీతి కేసుల ఆరోపణలు ఎదుర్కుంటోన్న జగన్ అవినీతికి వ్యతిరేకమని ప్రకటనలు చేయడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. జగన్ పై 12 కేసులు ఉన్నాయనీ, వీటికి సంబంధించి ఈడీ రూ.40,000 కోట్లు జప్తు చేసిందని ఆరోపించారు. జగన్ కేబినెట్ లో ఉన్న బొత్స, అవంతిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని విమర్శించారు. అలాంటి జగన్ అవినీతిరహిత పాలన గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
Andhra Pradesh
prajavedika

More Telugu News