Hyderabad metro: మెట్రో ప్రయాణికులకు తీపి కబురు.. నేటి నుంచి అందుబాటులోకి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు స్టేషన్

హైదరాబాద్ మెట్రోరైలు ప్రయాణికులకు ఇది శుభవార్తే. నేటి నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మెట్రో రైలు స్టేషన్ అందుబాటులోకి వస్తోంది. నిజానికీ స్టేషన్ సిద్ధమై చాలా రోజులే అయినప్పటికీ రైలు వేళల్ని సర్దుబాటు చేయడం కోసం ఇప్పటి వరకు అందుబాటులోకి తీసుకురాలేదు.  మార్చి 20న అమీర్‌పేట-హైటెక్ సిటీ మార్గం అందుబాటులోకి వచ్చింది. అయితే, సైబర్ టవర్స్ వద్ద రైలు ట్రాక్ మారే సదుపాయం లేకపోవడంతో చెక్‌పోస్టు వరకు వెళ్లిన మార్గంలోనే రైళ్లు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వేళలు సర్దుబాటు కావడం ఇబ్బందిగా మారడంతో ఈ స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకురాలేదు. ఇప్పుడు అందుకు అనుగుణంగా వేళల్లో మార్పులు చేయడంతో ఈ స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. చెక్‌పోస్టు స్టేషన్‌తో కలుపుకుంటే ప్రస్తుతం 50 మెట్రో స్టేషన్లు వినియోగంలోకి వచ్చినట్టు అయింది.

చెక్‌పోస్టు స్టేషన్ వల్ల ఫిలింనగర్‌, జర్నలిస్ట్‌కాలనీ, నందగిరిహిల్స్‌, తారకరామనగర్‌, దీన్‌దయాళ్‌నగర్‌, గాయత్రిహిల్స్‌, చెక్‌పోస్టు, కేబీఆర్‌ పార్కు చుట్టుపక్కల కాలనీలవాసులకు మెట్రోరైలు సేవలు చేరువలోకి వచ్చినట్టు అయిందని మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. కాగా, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు స్టేషన్‌కు ఓ ప్రత్యేకత కూడా ఉంది. సాధారంగా మెట్రో స్టేషన్లలో ఓ అంతస్తులో టికెట్ కౌంటర్లు ఉండగా, మరో అంతస్తులో ప్లాట్‌ఫాం ఉంటుంది. ఇక్కడ మాత్రం ఈ రెండూ ఒకే చోట ఉండడం గమనార్హం.
Hyderabad metro
jubilee hills checkpost
filmnagar
journalist colony

More Telugu News