స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలతో ఫోటో దిగిన టీఆర్ఎస్ కార్యకర్త అరెస్ట్!

  • మర్రి రాజశేఖరరెడ్డికి పోలింగ్ ఏజంట్ గా ఉన్న వెంకటేశ్
  • ఈవీఎంలతో సెల్ఫీలు, వీడియోలు
  • కేసు నమోదు చేసిన పోలీసులు
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను భద్రపరిచిన చోట, టీఆర్ఎస్ కార్యకర్త ఒకరు సెల్ఫీ దిగి, వీడియో తీసుకోవడం, అవి బయటకు వచ్చి వైరల్ కావడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మర్రి రాజశేఖరరెడ్డికి పోలింగ్ ఏజంట్ గా వ్యవహరించిన ఎన్ వెంకటేశ్ అనే వ్యక్తి, పోలింగ్ అనంతరం ఈవీఎంలు, వీవీ ప్యాట్ యంత్రాలను హోలీ మేరే కాలేజ్ లో భద్రపరుస్తున్న వేళ, వెళ్లాడు.

ఆ సమయంలో ఫోటోలు దిగి, వీడియో తీసుకున్నాడు. చట్టవిరుద్ధంగా స్ట్రాంగ్ రూములో వీడియో, ఫోటోలు తీశారని కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కాగా, మల్కాజిగిరిలో ఈ దఫా త్రిముఖ పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. మర్రి రాజశేఖరరెడ్డికి పోటీగా కాంగ్రెస్ నుంచి ఏ రేవంత్ రెడ్డి, బీజేపీ నుంచి ఎన్ రామచంద్రరావు పోటీలో ఉన్నారు.
Go Back to Shorts
EVMs
Strong Rooms
Venkatesh
Selfy

More Telugu News