చంద్రబాబు, లోకేశ్ ను జైలుకు పంపలేదో.. నేను ఎన్టీఆర్ భార్యనే కాదు!: లక్ష్మీపార్వతి శపథం

  • చంద్రబాబు కుటుంబం 25 ఏళ్లుగా అవమానిస్తోంది
  • కుటుంబ గౌరవం కోసం అన్నింటిని మౌనంగా భరించా
  • ఇకపై ఎలాంటి విమర్శలు చేసినా చట్టపరంగా ముందుకెళతా
గత 25 ఏళ్లుగా చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు చేసిన అవమానాలను తాను భరిస్తూ వచ్చానని దివంగత ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి తెలిపారు. చంద్రబాబు, లోకేశ్ లను త్వరలో జైలుకు పంపకపోతే తాను ఎన్టీఆర్ భార్యనే కాదని శపథం చేశారు. ఎన్టీఆర్ మరణానికి కూడా తానే కారణమని తనపై తప్పుడు అభియోగాలు మోపి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.

లక్ష్మీపార్వతి తనను వేధిస్తున్నారని కోటి అనే వ్యక్తి ఇటీవల మీడియా ముందుకు రావడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై లక్ష్మీపార్వతి స్పందిస్తూ.. తన వ్యక్తిత్వాన్ని హీనంగా చూపే కుట్రలు సాగుతున్నాయని చెప్పారు. ‘గతంలో మీ నాయకుడు నామీద ఇలాంటి నిందలే వేశాడు. కానీ నా భర్త(ఎన్టీఆర్) అవి నిజం కాదని నిరూపించి మరీ నన్ను పెళ్లి చేసుకున్నాడు. అది నాకు గర్వకారణం.

ఏంట్రా.. అసలు మీరేం చేస్తారు? 30 ఏళ్ల వయసులోనే నాపై ఎలాంటి మచ్చ లేదు. 66 ఏళ్ల వయసులో నాపై మచ్చ ఆపాదిస్తారా?’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో ప్రజలకు వాస్తవాలు తెలిశాయని వ్యాఖ్యానించారు. కుటుంబం పరువు కోసమే ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని తెలిపారు. తనపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే ఇకపై చట్టపరంగా ముందుకు వెళతానని హెచ్చరించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
YSRCP
lakshmi parvathy
Chandrababu
Nara Lokesh
warning

More Telugu News