కడపకు ఉన్న మంచి పేరును జగన్ చెడగొడుతున్నాడు: సీఎం చంద్రబాబు
వైసీపీ అధినేత జగన్ ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తూర్పారబట్టారు. కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని, నిజాలంటే ఆయనకు భయమని సెటైర్లు వేశారు. వైసీపీ నేతలు లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీపై విషం కక్కుతున్న మోదీ, కేసీఆర్ తో జగన్ కలిశారని అన్నారు. విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడం జగన్ వైఖరి అని విమర్శించారు. జగన్ కు ప్రజల కష్టనష్టాలేవీ పట్టవని, ఆయనకు ఓటేస్తే రాష్ట్రాభివృద్ధి ఆగిపోతుందన్న చంద్రబాబు, కడపకు ఉన్న మంచి పేరును జగన్ చెడగొడుతున్నాడని దుమ్మెత్తిపోశారు. ‘కోడికత్తి పార్టీని’ నమ్ముకుంటే ప్రజలు చాలా నష్టపోతారని అన్నారు.