మేము బాధలో ఉంటే చంద్రబాబు వెటకారపు నవ్వుతో మాట్లాడతారా?: వైసీపీ నేత పార్థసారథి

  • వివేకా మృతిపై సానుభూతి వ్యక్తం చేయకుండా ముసిముసి నవ్వులా!
  • ఈ కేసులో దోషులను పట్టుకోరే
  • పైగా జగన్ ని ఇరికించాలని చూస్తారా?
వైఎస్ వివేకానందరెడ్డి మృతితో తాము బాధలో ఉంటే, చంద్రబాబు వెటకారపు నవ్వులతో మాట్లాడారని వైసీపీ నేత పార్థసారథి విమర్శించారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అజాతశత్రువు వివేకా మృతిపై పార్టీలకు అతీతంగా అందరూ బాధపడుతుంటే, చంద్రబాబు మాత్రం వెటకారపు నవ్వు నవ్వుతూ మాట్లాడారని విమర్శించారు. ఎవరికైనా ఆపద వస్తే తన బాధగా భావించాల్సిన చంద్రబాబునాయుడు, ఆరోజున ప్రెస్ మీట్ లో ముసిముసి నవ్వులను ఆపుకుంటూ మాట్లాడారని అన్నారు.

బాధను వ్యక్తం చేయాల్సింది పోయి, తమ పార్టీ విజయానికి ఒక అవకాశం లభించిందన్న భ్రమలో ఉండి ఏ విధంగా మాట్లాడారో మనకు అర్థమవుతుందని ఆయన అన్నారు. మానవత్వం ఉన్న ఎవరూ ఎవరి మృతి పట్ల సంతోషం వ్యక్తం చేయరని, వివేకా మృతిపై సానుభూతి వ్యక్తం చేయాల్సిన చంద్రబాబు ముసిముసి నవ్వులు నవ్వారని దుయ్యబట్టారు. వివేకా మృతి కేసులో దోషులను పట్టుకోవాల్సింది పోయి, జగన్ ని, వైసీపీ నేతలను ఏ విధంగా ఇరికించాలా అని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. మళ్లీ అధికారం సంపాదించాలన్న తపనతో ఉన్న చంద్రబాబు, ఈ హత్యను జగనే చేయించారని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Jagan
viveka
partha saradhi
Telugudesam
Chandrababu

More Telugu News