చంద్రబాబుకు అంతా చెప్పాను.. అనుచరులతో చర్చించాకే భవిష్యత్ కార్యాచరణ!: ఆమంచి కృష్ణమోహన్

చీరాల ఎమ్మెల్యే, టీడీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇటీవల ఆమంచి టీడీపీని వీడుతారన్న వార్తల నేపథ్యంలో చంద్రబాబు నుంచి ఫోన్ రావడంతో ఆయన ఈరోజు ఏపీ అసెంబ్లీకి చేరుకున్నారు. మంత్రి శిద్ధా రాఘవరావు ఆమంచిని ముఖ్యమంత్రి ఛాంబర్ కు తీసుకెళ్లారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, తనకు ఎదురవుతున్న ఇబ్బందులు తదితర విషయాలపై ఆమంచి 30 నిమిషాల పాటు చంద్రబాబుతో చర్చించారు.

అనంతరం మీడియాతో ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ.. పార్టీలో తనకు ఎదురవుతున్న ఇబ్బందులను అధినేత చంద్రబాబుకు వివరించినట్లు తెలిపారు. తాను చెప్పిన విషయాలను సీఎం సానుకూలంగా విన్నారన్నారు. తన రాజకీయ భవిష్యత్ పై అనుచరులు, మద్దతుదారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. తాను ఒక్కడినే ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేననీ, నాయకుడిగా అందరి అభిప్రాయాలు తీసుకున్నాక రియాక్ట్ అవుతానని చెప్పారు. టీడీపీలో ఉండాలన్నదే తన అభిమతమన్నారు. అనంతరం అక్కడి నుంచి చీరాలకు బయలుదేరారు.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
chirala mla
amanchi krishna mohan
Telugudesam
YSRCP
30 minutes

More Telugu News