రేపు ఉభయసభలకు నల్లచొక్కాలు ధరించి రావాలి: టీడీపీ సభ్యులకు చంద్రబాబు ఆదేశం
- పునర్విభజన చట్టం అమలుపై రేపు చర్చిస్తాం
- ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం
- నిరసన ర్యాలీలు నిర్వహించాలని పిలుపు
ఏపీ అసెంబ్లీలో పునర్విభజన చట్టం అమలుపై రేపు చర్చ జరగనుందని, సభ్యులందరూ ఉభయసభలకు నల్లచొక్కాలు ధరించి హాజరుకావాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చ జరుపుతున్నామని, అనంతరం, ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని అన్నారు. ప్రత్యేక హోదా సాధన నిమిత్తం ప్రత్యేక హోదా సాధన సమితి, ఇతర సంఘాలు బంద్ కు పిలుపునిచ్చిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. బంద్ కు తాము వ్యతిరేకం కనుక నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీలు నిర్వహించాలని తమ నాయకులకు సూచించారు.