నేడు ఐపీఎల్ ఆటగాళ్ల వేలం... రూ. కోటికే యువరాజ్... అయినా కొనేవారేరి?

  • గతంలో సీజన్ కు రూ. 16 కోట్లు అందుకున్న యువరాజ్
  • నేడు కనీస ధరకు పడిపోయిన యువీ
  • కొనుగోలు చేయాలని సీఎస్కే ఫ్యాన్స్ ఒత్తిడి
2019 సీజన్ కు గాను, ఐపీఎల్ ఆటగాళ్ల వేలం జైపూర్ వేదికగా నేటి నుంచి ప్రారంభం కానుండగా, అందరి కళ్లూ యువరాజ్ సింగ్ పైనే ఉన్నాయి. ఒక సీజన్ లో రూ. 16 కోట్లు అందుకున్న యువీ, నేడు కనీస ధరైన రూ. 1 కోటి క్లబ్ లోకి చేరిపోయి, తనను ఎవరు కొనుగోలు చేస్తారా? అని వేచి చూడాల్సిన పరిస్థితిలో ఉన్నాడు.

ఫామ్ లో లేకపోవడం, ఇటీవలి కాలంలో దేశవాళీ టోర్నమెంట్లలో సైతం చెప్పుకోతగ్గ స్థాయిలో ఆడకపోవడంతో యువరాజ్ ను ఏ ఫ్రాంచైజీ దక్కించుకుంటుందో వేచి చూడాలి. యువరాజ్ తమకు కావాలని బలమైన ఫ్రాంచైజీగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఆన్ లైన్ ద్వారా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నారు.

కాగా, గత సీజన్ లో రూ. 11.5 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసిన జైదేవ్ ఉనద్కత్, ఇప్పుడు రూ. 1.5 కోట్ల జాబితాలోకి వచ్చాడు. మొత్తం 346 మంది ఆటగాళ్ల వేలం జరుగనుండగా, వీరి నుంచి 70 మందిని లీజ్ లోని 8 జట్లు వేలంలో కొనుగోలు చేయనున్నాయి. 2019 మే లో ప్రపంచకప్ క్రికెట్ పోటీలు ఉన్నందున, ఈలోగానే ఐపీఎల్ సీజన్ ను ముగించాలని బీసీసీఐ భావిస్తోంది.
Go Back to Shorts
IPL
Auction
Yuvaraj Singh
Chennai Superkings

More Telugu News