Telangana: నెక్ట్స్ ఏంటి?.. గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతల కీలక భేటీ!

  • తెలంగాణ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షా సమావేశం
  • భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం
  • భేటీకి హాజరైన ఉత్తమ్, జానా, సునీత, శ్రవణ్
ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ 17, టీడీపీ 2 సీట్లు, బీజేపీ ఓ సీటుతోపాటు ఇద్దరు స్వతంత్రులు విజయం సాధించారు. ఫలితాల వెల్లడి అనంతరం ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు అధికార టీఆర్ఎస్ లో చేరడంతో పార్టీ బలం ఏకంగా 90కు చేరుకుంది. కాగా, ఈ ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడినప్పటికీ పరాజయం ఎదురుకావడంతో కాంగ్రెస్ నేతల్లో అంతర్మథనం మొదలైంది.

ఇందుకోసం కాంగ్రెస్ నేతలు ఈ రోజు గాంధీభవన్ లో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి సహా ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. తెలంగాణ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనీ, అందువల్లే కేసీఆర్ కు భారీగా ఓట్లు పోల్ అయ్యాయని వీహెచ్ సహా పలువురు సీనియర్ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈవీఎంల వ్యవహారంతో పాటు కీలకమైన పార్లమెంటు ఎన్నికలకు ముందు పార్టీ ఓటమిపై కాంగ్రెస్ నేతలు ఈ సమావేశంలో చర్చించనున్నారు. తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి చేపట్టాల్సిన చర్యలపై నేతలు ఈ భేటీలో ఓ నిర్ణయానికి రానున్నారు.
Telangana
Congress
Telangana Assembly Results
MEETING
gandhi bhavan

More Telugu News