KCR: నాకు ఏ మాత్రం డౌట్ లేదు: కేసీఆర్

  • చింతమడకలో ఓటేసిన కేసీఆర్
  • విజయం సాధించేది టీఆర్ఎస్సే
  • ఓటేసిన అనంతరం మీడియాతో కేసీఆర్
ఈ ఉదయం సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలోని చింతమడక గ్రామానికి తన భార్యతో కలసి వచ్చిన తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కె.చంద్రశేఖరరావు, ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేసీఆర్ రాక సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేయగా, ఇతర ఓటర్లకు ఇబ్బంది కలగరాదన్న ఉద్దేశంతో కేవలం 5 నిమిషాల్లో కేసీఆర్, తన ఓటును వేసేసి వెళ్లిపోయారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో విజయం సాధించబోయేది టీఆర్ఎస్సేనని అన్నారు. భారీ మెజారిటీతో తాము గెలవబోతున్నామని, ఈ విషయం సాయంత్రానికి ఎగ్జిట్ పోల్స్ రూపంలో వెల్లడవుతుందని తెలిపారు.

టీఆర్ఎస్ వైపు అనుకూల పవనాలు వీస్తున్నాయని అన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఓటర్లు ఉన్నారని, ఈ దఫా ఓట్ల శాతం చాలా పెరగబోతున్నదని కేసీఆర్ అంచనా వేశారు. తిరిగి అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ అని, ఈ విషయంలో తనకు ఎటువంటి అనుమానాలు లేవని అన్నారు. తాను కేవలం ఓటు వేసేందుకు మాత్రమే వచ్చానని, గ్రామస్థులను కలవలేదని, మరో రెండు వారాల్లో వచ్చి కలుస్తానని మాత్రం చెప్పానని అన్నారు. ఓటేసేందుకు వచ్చిన కేసీఆర్ కు హరీశ్ రావు స్వాగతం పలికారు.

More Telugu News

KCR
Vote
Chintamadaka