హత్య కేసును ఛేదించేందుకు పనిమనిషిగా ఆరు నెలలు పనిచేసిన ముంబై లేడీ డిటెక్టివ్.. వైరల్ అవుతున్న స్టోరీ!

సాధారణంగా సినిమాల్లోనే ఇలాంటివి కనిపిస్తుంటాయి. కానీ ఇప్పుడు నిజంగా జరిగింది. ఓ హత్య కేసును ఛేదించేందుకు ఓ మహిళా డిటెక్టివ్ పనిమనిషి వేషం ఎత్తింది. ఆరు నెలలపాటు పనిచేసి కేసు మిస్టరీని విజయవంతంగా ఛేదించింది. ముంబైలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనమైంది. దేశంలోనే తొలి మహిళా డిటెక్టివ్‌గా పేరు సంపాదించుకున్న రజనీ పండిట్ తాజాగా తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్టు చేసింది. ఓ హత్య కేసును ఛేదించేందుకు తానేం చేసిందీ వివరించింది. ఆమె స్టోరీకి విపరీతమైన స్పందన వచ్చింది. ఒక్క రోజైనా గడవకముందే 1300 షేర్లు, 1600 రియాక్షన్లు వచ్చాయి.

కట్టుకున్న భర్తను, కుమారుడిని హత్య చేసినట్టు ఓ మహిళ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ హత్యలోని మిస్టరీని ఛేదించాల్సిందిగా కేసు రజనీ పండిట్ వద్దకు వచ్చింది. 22 ఏళ్ల వయసులోనే తొలి కేసును ఛేదించిన రజనీ దీనిని సవాలుగా తీసుకుంది. అనుమానితురాలి ఇంట్లోనే పనిమనిషిగా చేరింది. ఆరు నెలలపాటు పనిచేసింది. చివరికి నిందితురాలే హత్య చేసినట్టు నిరూపించింది.

ఓసారి తాను రికార్డింగ్ చేసుకునే సమయంలో సౌండ్ వచ్చిందని, దీంతో ఆమె తనను అనుమానించడం మొదలుపెట్టిందని రజనీ పేర్కొంది. తనపై నిఘా పెట్టిందని, తాను బయటకు వెళ్లేటప్పుడు గమనించేదని వివరించింది. చివరికి భర్తను హత్య చేసేందుకు ఓ కిరాయి హంతకుడితో ఒప్పందం కుదర్చుకున్న విషయాన్ని గుర్తించి సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది.

Mumbai
detective
murder mystery
Rajani Pandit

More Telugu News