అదేదో చంద్రబాబునే ఎన్‌కౌంటర్ చేస్తే ఓ పని అయిపోతుంది కదా?: బీజేపీపై శివాజీ ఫైర్

  • ప్రజలను హింసించడం మానేసి చంద్రబాబును ఎన్‌కౌంటర్ చేయండి
  • ‘రాఫెల్’ నుంచి దృష్టి మళ్లించడానికే ఐటీ దాడులు
  • పవన్ చెప్పుడు మాటలు విని హోదాను పక్కనపెట్టారు
ప్రధాని నరేంద్రమోదీపై టాలీవుడ్ నటుడు శివాజీ మరోమారు విరుచుకుపడ్డారు. మోదీ టార్గెట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని, కాబట్టి ప్రజలను హింసించే బదులు అదేదో చంద్రబాబునే ఎన్‌కౌంటర్ చేస్తే ఓ పని అయిపోతుంది కదా అని అన్నారు. శుక్రవారం రాత్రి విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మొన్న తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపైన, ఇప్పుడు ఏపీలో ఐటీ దాడుల వెనక కేంద్రానికి ప్రత్యేక లక్ష్యం ఉందని ఆరోపించారు.

నలుగురు దుర్మార్గులు ఢిల్లీలో కూర్చుని రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మొత్తం దాడుల వెనక ఓ వ్యక్తి ఉన్నాడని, అతడే సమాచారాన్ని ఐటీ అధికారులకు అందిస్తున్నాడని అన్నారు. చంద్రబాబుపై కోపంతో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న వారు.. ఆయననే ఎన్‌కౌంటర్ చేసేస్తే ఇలా ప్రజలను హింసించాల్సిన అవసరం ఉండదన్నారు.

దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న రాఫెల్ కుంభకోణం నుంచి ప్రజల దారి మళ్లించడానికే కేంద్రం ఐటీ దాడులతో బెంబేలెత్తిస్తోందని శివాజీ అన్నారు. తాను ర్యాలీ నిర్వహించి ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తానని చెప్పారు. ఏపీ ప్రజల మంచితనం వల్లే జీవీఎల్ ఇక్కడ తిరగగలుగుతున్నారని, అదే తెలంగాణలో అయితే కాలు కూడా పెట్టేవారు కాదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం ‘హోదా సైన్యాన్ని’ తయారు చేస్తున్నట్టు శివాజీ తెలిపారు. టీటీడీలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెబుతున్న సుబ్రహ్మణ్యస్వామి ఓ సన్నాసని, తిరుమల జోలికి ఎవరొచ్చినా నరికేస్తానని హెచ్చరించారు. చెప్పుడు మాటలు విని పవన్ కల్యాణ్ హోదా గురించి మర్చిపోయారని శివాజీ అన్నారు. నవంబరు 2న హోదా సైన్యంతో రహదారులపై ఆందోళనలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
Go Back to Shorts
Andhra Pradesh
Shivaji
Actor
Pawan Kalyan
Chandrababu
Encounter
Narendra Modi

More Telugu News