ముంబైలో పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ.. అమరావతిపై ప్రజెంటేషన్!

  • దేశంలో ఏపీ అగ్ర స్థానంలో ఉండాలనేదే తన విజన్ అన్న చంద్రబాబు 
  • రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ విన్నపం
  • ఏపీలో హోటల్ డెవలప్ మెంట్ కు టాటా సహకారం కోరిన సీఎం  
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీబిజీగా గడుపుతున్నారు. తాజ్ ప్యాలెస్ హోటల్ లో ఆయన పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. అమరావతిపై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఏపీ అగ్రస్థానంలో ఉండాలనేదే తన విజన్ అని చెప్పారు.

2050 నాటికి ఏపీ ప్రపంచంలో బెస్ట్ డెస్టినేషన్ గా ఉండాలనేది తన లక్ష్యమని, దానికి అనుగుణంగానే గత నాలుగేళ్లుగా ఏపీ వృద్ధి రేటును నమోదు చేస్తోందని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ వరుసగా అగ్రస్థానంలో నిలబడుతోందని చెప్పారు. పెట్టుబడులకు ఏపీ అనువైన ప్రాంతమని తెలిపారు. ఈ భేటీకి రతన్ టాటా, టీసీఎస్ సీఈవో చంద్రశేఖరన్ లు కూడా పాల్గొన్నారు.

విశాఖ-చెన్నై కారిడార్, కర్నూలు-చెన్నై కారిడార్, బెంగుళూరు-చెన్నై కారిడార్ ఇలా వేర్వేరు ఉత్పత్తి నోడ్లను నిర్మిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఏరోస్పేస్, హెల్త్, పెట్రో కెమికల్స్, రక్షణ రంగాలకు తమ వద్ద సరైన విధానాలు ఉన్నాయని... భూ బ్యాంకు కూడా అందుబాటులో ఉందని చెప్పారు. భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలను పెంచబోమని తెలిపారు. ఏపీలో హోటల్ డెవలప్ మెంట్ కు టాటా గ్రూపు సహకరించాలని, విజయవాడ-సింగపూర్ ల మధ్య విమానాలు నడపాలని కోరారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ప్రజా రవాణా వ్యవస్థలో టాటా గ్రూపు సాంకేతిక సహకారాన్ని అందించాలని విన్నవించారు.
Go Back to Shorts
Chandrababu
mumbai
industrialists
meeting
ratan tata

More Telugu News