Andhra Pradesh: వరకట్న వేధింపుల కేసులో ఎస్సైకి ఐదేళ్ల జైలు శిక్ష.. రూ.17 లక్షల జరిమానా!

  • వరకట్న వేధింపుల కేసులో ఎస్సైని దోషిగా తేల్చిన కోర్టు
  • వరకట్న వేధింపులకు ఐదేళ్లు, గృహహింసకు మూడేళ్లు జైలు
  • ఎస్సై తల్లికి మూడేళ్ల జైలు శిక్ష
వరకట్న వేధింపుల కేసులో ఓ సబ్ ఇన్‌స్పెక్టర్‌కు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాదు సమీపంలోని మేడ్చల్‌ కు చెందిన ఎస్‌ఐ మల్లుల సతీశ్ కుమార్ రాజమహేంద్రవరానికి చెందిన శిరీషాదేవిని 2014లో వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొన్నాళ్ల తర్వాతి నుంచి అదనపు కట్నం కోసం సతీశ్ కుమార్ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులు తాళలేని శిరీష పుట్టింటికి వెళ్లిపోయి భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  రాజమహేంద్రవరం ఐదో ఏజేఎఫ్‌సీఎం కోర్టులో విచారణ జరిగింది. సతీశ్ కుమార్‌పై మోపిన నేరారోపణలు రుజువు కావడంతో న్యాయమూర్తి సీహెచ్‌వీ రామకృష్ణ గురువారం తీర్పు వెలువరించారు. వరకట్న వేధింపులకు ఐదేళ్లు, గృహహింసకు మరో మూడేళ్లు ఏకకాలంలో అనుభవించాలని తీర్పు చెప్పారు. అంతేకాక, కేసు తీవ్రతను పరిశీలించిన మీదట సతీశ్‌కు రూ.17 లక్షల జరిమానా కూడా విధించారు. ఇదే కేసులో రెండో ముద్దాయి అయిన సతీశ్ తల్లి విజయశారదకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
Andhra Pradesh
Rajamahendravaram
court
SI
Jail

More Telugu News