సాహితీవేత్త పెండెం జగదీశ్వర్ ఆత్మహత్యకు కుటుంబ వివాదమే కారణం?

ప్రముఖ తెలంగాణ సాహితీవేత్త, బాలల రచయిత పెండెం జగదీశ్వర్ ఆత్మహత్యకు కుటుంబ తగాదాలే కారణమని తెలుస్తోంది. నల్గొండ జిల్లా చిట్యాల శివారులో రైలు కిందపడి ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఆయనకు భార్య, ఇద్దలు పిల్లలు ఉన్నారు.

రామన్నపేట మండలం మునిపంపుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన, రోజులానే పాఠశాలకు బయలుదేరి, చిట్యాల వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. కుటుంబంలో నెలకొన్న వివాదాల కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని చెప్పారు. ఆయన దాదాపు 30కి పైగా పుస్తకాలు రాయగా, 'చెట్టు కోసం' అనే కథనాన్ని మహారాష్ట్ర సర్కారు 6వ తరగతి తెలుగు పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చింది. గత కొంతకాలంగా ఆయన ముభావంగా ఉన్నారని, ఇంట్లో చిన్నచిన్న తగాదాలు జరుగుతుండేవని స్థానికులు తెలిపారు. 


More Telugu News