మఫ్టీలో ఏపీకి వెళ్లిన తెలంగాణ పోలీసులు... కట్టేసి చితకబాదిన ప్రజలు!

  • పిల్లల కిడ్నాపర్ కోసం వెళ్లిన పోలీసులు
  • ఓ మహిళను అరెస్ట్ చేయబోయి విఫలం
  • తాళ్లతో చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్థులు
చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్న మహిళను అరెస్ట్ చేసేందుకు మఫ్టీలో ఏపీకి వెళ్లిన తెలంగాణ పోలీసులను దొంగలనుకుని కట్టేసి కొట్టారు అక్కడి ప్రజలు. ఆపై తెల్లారాక పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి అసలు విషయం తేల్చేసరికి నాలిక్కరుచుకున్నారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, మహబూబాబాద్ జిల్లా బాలానగర్ కు చెందిన పోలీసులు ఓ కేసు విషయమై కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా సమీపంలోని రామసముద్రం గ్రామానికి వెళ్లారు. ఏదైనా కేసు పనిపై వేరే ప్రాంతానికి వెళితే, అక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వాల్సివుండగా, ఆ పని చేయలేదు. ఇక ఈ పోలీసులు ఘనీ అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లి, అక్కడున్న మహిళను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా, ఘనీ అడ్డుపడ్డాడు.

దీంతో ఆయన్ను పోలీసులు కొట్టగా, అతను పెద్దగా అరుస్తూ చుట్టుపక్కలవారిని అప్రమత్తం చేశాడు. దీంతో పెద్దఎత్తున అక్కడికి చేరుకున్న గ్రామస్థులు, వాళ్లను తాళ్లతో చెట్టుకు కట్టేసి చితకబాదారు. తాము పోలీసులమని చెబుతున్నా వినలేదు. చివరకు విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి వారిని విడిపించారు.
Go Back to Shorts
Hyderabad
Police
Andhra Pradesh
Telangana
Arrest
Kidnaper
Mahabubabad District

More Telugu News