జగన్-పవన్ లను బీజేపీ నడిపిస్తుంటే.. మరి,చంద్రబాబు ఎవరిని నడిపిస్తున్నారు?: సోము వీర్రాజు

  • ఏపీ ప్రజలను చంద్రబాబు గాలికొదిలేశారు!
  • దేశ, కర్ణాటక రాజకీయాలతోనే కాలం గడుపుతున్నారు
  • కాంగ్రెస్ పార్టీతో కలిసి జీవించే సంస్కృతి చంద్రబాబుది
సీఎం చంద్రబాబుపై బీజేపీ నేత సోము వీర్రాజు మళ్లీ విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘జగన్మోహన్ రెడ్డి, పవన్ కల్యాణ్ లను బీజేపీ నడిపిస్తుంటే..మరి, నలభై ఏళ్ల అనుభవమున్న చంద్రబాబు.. ఎవరిని నడిపిస్తున్నారు? ఏపీ ప్రజలను గాలికొదిలేశారు’ అని బీజేపీ నేత సోము వీర్రాజు ప్రశ్నించారు. దేశ, కర్ణాటక రాజకీయాలతోనే ఆయన కాలం గడుపుతున్నారని, సాధికార సభల్లోనూ రాజకీయాలే ప్రస్తావిస్తున్నారంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

చంద్రబాబు ప్రభావం కర్ణాటక ఎన్నికల్లో ఉంటే బీజేపీకి 25 శాతం నుంచి 35 శాతం ఓట్లు ఎలా సాధించిందని ప్రశ్నించారు. డిపాజిట్లు కోల్పోయిన పార్టీ నేత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి జీవించే సంస్కృతి చంద్రబాబుదని, దీక్షల పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

నాడు వాజ్ పేయి ప్రభుత్వాన్ని పడగొట్టి దేవెగౌడకు మద్దతిచ్చారని, విద్యను కార్పొరేట్ స్కూళ్లకు అప్పగించారంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా తిరుమలలో జరుగుతున్న పరిణామాలను  ఆయన ప్రస్తావించారు. ‘అమిత్ షాను రమణదీక్షితులు కలవడాన్ని తప్పుపడతారా? తిరుపతిలో ఎల్ 1, ఎల్ 2 సేవలు ఎవరికి అమ్ముతున్నారు?’ అని ప్రశ్నించారు.
Go Back to Shorts
somu veeraj
Chandrababu

More Telugu News