తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. జూన్ 6న ప్రకటన

  • జూలైతో ముగియనున్న పంచాయతీల పదవీకాలం
  • ఐదు వారాల ముందే ఎన్నికల నిర్వహణ
  • జూన్ 6న నోటిఫికేషన్
  • 23 కల్లా మొత్తం ప్రక్రియ పూర్తి
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ముహూర్తం ఖరారైంది. జూలై నెలాఖరుతో రాష్ట్రంలోని 15 పంచాయతీలు తప్ప మిగతా వాటి పదవీకాలం ముగుస్తుండడంతో అంతకుముందే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాలకవర్గాల పదవీకాలం ముగియడానికి ఐదు వారాల ముందే ఎన్నికలు నిర్వహించి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆగస్టు ఒకటో తేదీన కొత్త పాలకవర్గాలు కొలువుదీరేలా చర్యలు తీసుకోనున్నారు. జూన్ 23 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం జూన్ 6న ఎన్నికల ప్రకటన జారీ చేయనున్నట్టు సమాచారం.

సోమవారం రాష్ట్ర ఎన్నికల అధికారులతో భేటీ అయిన పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఎన్నికల తేదీలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎన్నికల ప్రకటన వెలువడిన తేదీతో కలుపుకుని 12వ రోజున పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన వాటితో కలుపుకుని ప్రస్తుతం 12,751 పంచాయతీలు ఉండగా, వాటిలో 1,13,380 వార్డులున్నాయి. వీటన్నింటికీ మూడు విడతల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
Go Back to Shorts
Telangana
Panchayat
Elections

More Telugu News