అలాంటి వాళ్లను సింగపూర్ తరహాలో శిక్షించాలి: పవన్ కల్యాణ్

  • ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడేవారిని బహిరంగంగా శిక్షించాలి
  • పశువులకు కూడా ప్రకృతి నియమం ఉంటుంది.. మనకు లేకుండా పోయింది
  • అమ్మాయిలను రక్షించుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు
కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య తనను ఎంతో కలచివేశాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో కథువా ఘటనే మొదటిది కాదని ఆయన అన్నారు. ఏదైనా దారుణం జరిగితే కానీ, మనలో చలనం రావడం లేదని చెప్పారు. ఢిల్లీలో అత్యాచార ఘటన జరిగిన తర్వాతే నిర్భయ చట్టం వచ్చిందని తెలిపారు.

కళ్ల ముందు జరిగితే కానీ ఎంపీలు స్పందించరా? అని అసహనం వ్యక్తం చేశారు. ఆడపిల్లల్ని వేధించేవారిని, అత్యాచారానికి ఒడిగట్టేవారిని బహిరంగంగా శిక్షించాలని... అప్పుడే అందర్లో భయం పుడుతుందని అన్నారు. సింగపూర్ తరహాలో శిక్షలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పశువులకు కూడా ప్రకృతి నియమం ఉంటుందని... మానవ మృగాలకు ఎలాంటి నియమాలు లేకుండా పోయాయని అన్నారు.

ఆడపిల్లలు బయటకు వెళ్తే వారిని వేధింపుల నుంచి రక్షించుకోవడం ఎంత కష్టమో ఒక అన్నగా, ఒక తమ్ముడిగా తనకు తెలుసని పవన్ చెప్పారు. అమ్మాయిలు ఇంటికి చేరేంత వరకు భయపడుతూ ఉండే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్లినప్పుడు 200 మంది యూనిట్ సభ్యులం ఉన్నామని... అయినా బయటివారు వచ్చి, సినిమాకి సంబంధించిన అమ్మాయిలను వేధించారని... అప్పుడు తాను కర్ర పట్టుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అమ్మాయిలను రక్షించుకునేందుకు కఠినమైన చట్టాలు ఉండాలని జనసేన డిమాండ్ చేస్తోందని చెప్పారు. మన వ్యవస్థలో మార్పుల కోసం పోరాడుతామని తెలిపారు. 
Go Back to Shorts
Pawan Kalyan
women
girl child
sexual harrassment
Jana Sena

More Telugu News