steve smith: బాల్ ట్యాంపరింగ్ వ్యవహారం.. ఆసీస్‌కు స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్.. మరికొన్ని గంటల్లో శిక్షలు ఖరారు

బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ప్రపంచం ముందు నవ్వులపాలైన ఆసీస్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కేమరాన్ బాన్‌క్రాఫ్ట్‌లు స్వదేశం వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆటగాళ్లు దక్షిణాఫ్రికా విడిచి వెళ్లరాదని ఇది వరకే క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దర్యాప్తు పూర్తి కావడంతో వారిపై ఉన్న ఆంక్షలు ఎత్తివేసింది.

దర్యాప్తు కోసం దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్ చేరుకున్న సీఏ సీఈవో జేమ్స్ సుదర్‌లాండ్ మాట్లాడుతూ బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురికీ మరో 24 గంటల్లో శిక్షలు ఖరారు చేయనున్నట్టు చెప్పారు. దక్షిణాఫ్రికాతో జరగనున్న చివరి టెస్టులో వారు ఆడే అవకాశం లేదని, దీంతో వారిని స్వదేశం పంపిస్తున్నట్టు తెలిపారు. బుధవారం ఉదయానికి దర్యాప్తు పూర్తవుతుందని, అనంతరం ఈ ముగ్గురికీ శిక్షలు ప్రకటిస్తామని సుదర్‌లాండ్ వివరించారు.

దక్షిణాఫ్రికాతో జరగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఇప్పటికే 1-2తో వెనకబడింది. శుక్రవారం నుంచి చివరిదైన నాలుగో టెస్టు ప్రారంభం కానుండగా ఈ ముగ్గురు టాప్ ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగుతోంది. స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ స్థానాలను మ్యాట్ రెన్షా, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోయ్ బర్న్‌లతో భర్తీ చేస్తున్నారు.
steve smith
David warner
Cameron Bancroft
Australia
Ball tampering

More Telugu News