అందాల పోటీలకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన వారిని దారుణంగా కొట్టారు..ఇదేనా టీడీపీ ప్రభుత్వ విధానం?: లక్ష్మీపార్వతి

  • అందాల పోటీలు వద్దంటే దాడి చేశారు
  • మానభంగాలు, కబ్జాలు.. ఇదేనా ప్రభుత్వ విధానం
  • టీడీపీని చంద్రబాబు భ్రష్టు పట్టించారు
విశాఖలో భూకబ్జాలు, రౌడీయిజం రాజ్యమేలుతున్నాయని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి ఆరోపించారు. పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ కొమ్ము కాస్తోందని ఆమె మండిపడ్డారు. మహిళలపై దాడులను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారని అన్నారు. భూకబ్జాల వ్యవహారంలో తూతూ మంత్రంగానే కమిటీ వేశారని... దర్యాప్తును గాలికి వదిలేశారని విమర్శించారు. మహిళలపై దాడులకు నిరసనగా విశాఖపట్నంలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన లక్ష్మీపార్వతి ఈ మేరకు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

అందాల పోటీలకు నిరసనగా ఆందోళన చేపట్టిన మహిళలను దారుణంగా కొట్టారని లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై మానభంగాలు, కబ్జా రాజకీయాలు... ఇదేనా టీడీపీ ప్రభుత్వ విధానం అంటూ నిలదీశారు. బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు కూడా విఫలయత్నం చేశారని విమర్శించారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి టీడీపీని చంద్రబాబు హస్తగతం చేసుకున్నారని... ఇప్పుడు పార్టీని భ్రష్టు పట్టించారని అన్నారు. చంద్రబాబు ఎలాంటివారో అందరికీ తెలుసని చెప్పారు. 
Go Back to Shorts
lakshmi parvathi
ysrcp
chandrababu
Telugudesam

More Telugu News