టీడీపీలోకి జంప్... బుట్టా రేణుక, గుర్నాథరెడ్డి ఖాయం... గౌరు చరితారెడ్డి, బాలనాగిరెడ్డిలతో దేశం నేతల మంతనాలు!

  • మొత్తం ఐదుగురు ఫిరాయిస్తారని వార్తలు
  • వారిలో నలుగురి పేర్లు బయటకు
  • కర్నూలులో వైకాపా దాదాపు ఖాళీయే
  • అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ కు ఝలక్!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి మరింత మంది జంప్ చేయనుండగా, వారిలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు మరో ముగ్గురు కూడా టీడీపీలోకి చేరనున్నారని వార్తలు వస్తున్నప్పటికీ, వారు ఎవరన్నది తెలియాల్సి వుంది. కాగా, 2014 ఎన్నికల్లో కర్నూలు జిల్లాను దాదాపు వైకాపా స్వీప్ చేయగా, ఆపై దివంగత భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ సహా పలువురు ఎమ్మెల్యేలు పచ్చ కండువాలు కప్పుకున్న సంగతి తెలిసిందే.

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పేర్లు కూడా గత కొద్దికాలంగా జంప్ జిలానీల జాబితాలో వినిపిస్తున్నాయి. వీరికి గాలం వేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు, తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ను గ్యారెంటీగా ఇస్తామని చెబుతున్నట్టు సమాచారం. మరో ఏడాదిలోనో లేదా ఏడాదిన్నరలోనో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో వైకాపా అధినేత వైఎస్ జగన్ కు తాజా ఫిరాయింపులు మింగుడు పడని విషయమే.
Go Back to Shorts
Telugudesam
ysrcp
butta renuka
gurnath reddy

More Telugu News