బ్యాంకు ఖాతా, మ్యూచువల్ ఫండ్స్, మొబైల్ సిమ్, బీమా పాలసీలను ఆధార్ తో లింక్ చేసుకున్నారా...? ఆలస్యం చేయకండి..!

బ్యాంక్ అకౌంట్, షేర్లలో పెట్టుబడులు, ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్, అన్ని రకాల బీమా పాలసీలు అంటే వాహన, జీవిత, ఆరోగ్య బీమా తదితర, చివరికి మొబైల్ సిమ్ కార్డు ఇవన్నీ కూడా ఆధార్ తో అనుసంధానం కావాల్సిందే. గడువు మార్చి 31, 2018. అనుసంధానించుకోకుంటే ఏమవుతుందిలే? అనుకోవద్దు. సంబంధిత సేవలు నిలిచిపోతాయి. ఇప్పటికే చేసిన పెట్టుబడులు బ్లాక్ అవుతాయి. అంటే మీరు వాటిని పొందేందుకు అవకాశం ఉండదు. కనుక అనుసంధానించుకోవడం తప్పనిసరి.


బ్యాంకు ఖాతాలతో
representational imageప్రతీ ఖాతాదారుడు బ్యాంకు శాఖకు వెళ్లి తన ఆధార్ కార్డు జిరాక్స్ ను ఇవ్వడంతోపాటు ఓ ఫామ్ పై ఆ వివరాలను నింపి ఇస్తే ఆ నంబర్ ను ఖాతాకు అనుసంధానిస్తారు. బ్యాంకు శాఖకు వెళ్లే సమయంలో ఆధార్ ఒరిజినల్, ఫొటోకాపీ, పాస్ బుక్ తీసుకెళ్లడం మరవొద్దు. ఆన్ లైన్ లోనూ ఆధార్ నంబర్ ను సమర్పించే అవకాశాన్ని బ్యాంకులు కల్పించాయి.

నెట్ బ్యాంకింగ్ ద్వారా...
ఉదాహరణకు మీరు ఎస్ బీఐ ఖాతాదారులు అయితే నెట్ బ్యాంకింగ్ కు లాగిన్ అయిన తర్వాత ‘మై అకౌంట్స్’ను క్లిక్ చేయాలి. తర్వాత లింక్ యువర్ ఆధార్ నంబర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్ చేసుకోవాలి. ఆధార్ నంబర్ ఇచ్చిన తర్వాత సబ్ మిట్ బటన్ క్లిక్ చేయాలి. దీంతో మీ ఖాతాకు ఆధార్ నంబర్ అనుసంధానం అవుతుంది. బ్యాంకు నుంచి మీకు కన్ఫర్మేషన్ సందేశం కూడా ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. అదే ఎస్ బీఐ శాఖకు వెళ్లేట్టు అయితే ఆధార్ ఒరిజినల్, జిరాక్స్, పాస్ బుక్ తీసుకెళ్లాలి. బ్యాంకు శాఖలో ఆధార్ కార్డు లింకింగ్ ఫామ్ ఉంటుంది. దాన్ని ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఖాతా నంబర్, చిరునామా, ఇతర వివరాలు ఉంటాయి. బ్యాంకు సిబ్బంది తమ డేటాబేస్ లో ఉన్న వివరాలు, ఆధార్ డేటాబేస్ లో ఉన్న వివరాలతో సరిపోలితే లింకింగ్ చేస్తారు.

ఎస్ బీఐ అనే కాకుండా ఇతర బ్యాంకుల ఖాతాదారులు సైతం నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయిన తర్వాత ‘ఆధార్ సీడింగ్’ ఆప్షన్ ఎంచుకోవాలి. సర్వీసెస్ కాలమ్ లో ఈ ఆప్షన్ కనిపిస్తుంది. బ్యాంకుల పోర్టల్ ను బట్టి ఈ ఆప్షన్ వేరొక చోట అయినా ఉండొచ్చు. దీన్ని సెలక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ నంబర్ ను ఇచ్చి సబ్ మిట్ చేయాలి. ఆధార్ అనుసంధానం రిక్వెస్ట్ నమోదైననట్టు రిఫరెన్స్ నంబర్ కనిపిస్తుంది. అనుసంధానం పూర్తయిన తర్వాత మీ మొబైల్ కు ఎస్ఎంఎస్ వస్తుంది. కొన్ని బ్యాంకులు ఎస్ఎంఎస్ ద్వారా చేసుకునే సదుపాయాన్నీ కల్పించాయి.

అనుసంధానమైందీ, లేనిదీ చెక్ చేసుకోవచ్చు...
representational image
మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానమైందీ, లేనిదీ యూఐడీఏఐ (ఆధార్ జారీ, నిర్వహణ సంస్థ) వెబ్ సైట్ https://uidai.gov.in/ కు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. హోమ్ పేజీలోనే ఆధార్ సర్వీసెస్ కాలమ్ లో ‘చెక్ ఆధార్ అండ్ బ్యాంక్ అకౌంట్ లింకింగ్ స్టేటస్’ ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలక్ట్ చేసుకోవాలి. ఆధార్ నంబర్ ఇచ్చి, అక్కడ కనిపించే సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ బటన్ ను క్లిక్ చేయాలి. అప్పుడు మీ మొబైల్ నంబర్ (ఆధార్ డేటాబేస్ లో రిజిస్టరైన) కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి లాగిన్ బటన్ ను ఓకే చేయాలి. దాంతో ఏ బ్యాంకు ఖాతాతో మీ ఆధార్ నంబర్ లింక్ అయి ఉందో కనిపిస్తుంది.

మొబైల్ ద్వారా అయితే *99*99*1# కు కాల్ చేయాలి. 12 అంకెల ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. మరోసారి ఆ నంబర్ సరైనదా, కాదా అన్నది ధ్రువీకరించాలి. దాంతో ఆధార్ తో అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతా వివరాలు సందేశం రూపంలో కనిపిస్తాయి. కాకపోతే చివరిగా ఆధార్ తో అనుసంధానించుకున్న బ్యాంకు ఖాతా వివరాలనే ఇలా తెలుసుకోగలరు.

మ్యూచువల్ ఫండ్స్
మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టిన వారు కూడా వారి ఫోలియో నంబర్లను ఆధార్ నంబర్ తో లింక్ చేసుకోవాలి. ఈ పనిని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు ట్రాన్స్ ఫర్ ఏంజెట్లుగా పనిచేసే క్యామ్స్(సీఏఎంఎస్), కార్వీల ద్వారా చేసుకోవచ్చు. క్యామ్స్ 15 మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు, కార్వీ 17 మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు ఏజెంట్లుగా ఉన్నాయి.  

క్యామ్స్ వెబ్ సైట్ లింక్ ఇది.
https://adl.camsonline.com/InvestorServices/COL_Aadhar.aspx దీనికి వెళ్లిన తర్వాత పాన్ నంబర్, పుట్టిన తేదీ లేదా మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీల్లో ఏదో ఒకటి ఇవ్వాలి. ఆ తర్వాత వెరిఫై బటన్ ను క్లిక్ చేయాలి. ఒక్కోసారి సాంకేతిక లోపంతో పాన్ నంబర్ తప్పు అనో, అన్ అవైలబుల్ అనో చూపిస్తుంటుంది. ఇది సాంకేతిక లోపం. ఇలా వస్తే తర్వాత ప్రయత్నించాలి. ఒకవేళ సక్సెస్ ఫుల్ గా లాగిన్ అయితే తదుపరి పేజీలో మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల జాబితా కనిపిస్తుంది. మీకు పెట్టుబడులు ఉన్న ఫండ్ కంపెనీలను సెలక్ట్ చేసుకుని జనరేట్ ఓటీపీని క్లిక్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసి సబ్ మిట్ చేయాలి.

అలాగే  కార్వీ సంస్థ ద్వారా అయితే...https://www.karvymfs.com/karvy/Aadhaarlinking_individual.aspx ఈ లింక్ ను సందర్శించాలి. పాన్ నంబర్ ఇచ్చి క్లిక్ చేస్తే మొబైల్, ఈ మెయిల్ ఐడీలకు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి ఓకే చేయాలి. తర్వాత పేజీలో మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పేర్లు కనిపిస్తాయి. అందులో అప్పటికే మీకు పెట్టుబడులు ఉన్న సంస్థల పేర్లు డిఫాల్ట్ గానే సెలక్ట్ చేసి ఉంటాయి. కింద ఆధార్ నంబర్ కాలమ్ లో ఆధార్ నంబర్ ఇచ్చి సబ్ మిట్ చేయాలి.

representational imageక్యామ్స్ అయితే... హెచ్ డీఎఫ్ సీ మ్యూచువల్ ఫండ్, డీఎస్ పీ బ్లాక్ రాక్, బిర్లా సన్ లైఫ్, హెచ్ఎస్ బీసీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, ఐడీఎఫ్ సీ, ఐఐఎఫ్ఎల్, కోటక్ మ్యూచువల్ ఫండ్, ఎల్అండ్ టీ మ్యూచువల్ ఫండ్, మహింద్రా, పీపీఎఫ్ఏఎస్, ఎస్ బీఐ, శ్రీరామ్, టాటా మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు ట్రాన్స్ ఫర్ ఏజెంట్ గా పనిచేస్తోంది. ఈ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల్లో పెట్టుబడులన్నింటికీ ఆధార్ అప్ డేషన్ ను క్యామ్ చేసేస్తుంది.యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, బరోడా పయనీర్, బీఓఐ యాక్సా, కెనరా రొబెకో, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా, ఐడీబీఐ, ఇన్వెస్కో, జేఎం ఫైనాన్షియల్, ఎల్ఐసీ, మిరే అస్సెట్, మోతీలాల్ ఓస్వాల్, ప్రిన్సిపల్, రిలయన్స్, క్వాంటమ్, టారస్, యూటీఐ మ్యూచువల్ ఫండ్స్ ల్లో ఇన్వెస్ట్ చేసిన వారు కార్వీ వెబ్ సైట్ ద్వారా ఆధార్ అనుసంధానం చేసుకోవాలి. అలాగే, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు తమ పోర్టల్స్ నుంచి ఆధార్ అనుసంధానానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, డీఎస్ పీ బ్లాక్ రాక్ ఇప్పటికే ఆ సదుపాయాన్ని ప్రారంభించాయి.

ఎందుకు అనుసంధానం...?
మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ విధంగా ఆధార్ అనుసంధానాన్ని తీసుకొచ్చారు. నల్లధనం ఈ విధమైన పెట్టుబడుల రూపంలో పోగుబడకూడదన్న ఉద్దేశంతో, ఆర్థిక సేవలన్నింటినీ పారదర్శకంగా మార్చి, మరిన్ని పన్నులు రాబట్టుకునే యోచనతో, అక్రమాలకు చెక్ పెట్టే లక్ష్యంతో కేంద్ర సర్కారు ఆధార్ అనుసంధానాన్ని తీసుకొచ్చింది. భవిష్యత్తులో అన్నింటికీ, సమస్త సేవలకూ, గుర్తింపునకు ఆధార్ నంబర్ ఒక్కటే కీలకం, ప్రామాణికం కానుంది.

బీమా పాలసీలు
representational imageబీమా నియంత్రణ సంస్థ కూడా అన్ని రకాల పాలసీలను పాలసీదారుల ఆధార్ నంబర్, పాన్ నంబర్ తో అప్ డేట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత పాలసీదారులతో పాటు కొత్తగా జారీ చేసే పాలసీలకూ ఆధార్,  పాన్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, బీమా సంస్థలన్నీ ఇందుకు ఏర్పాట్లు చేయలేదు. బీమా మార్కెట్లో 76 శాతం మార్కెట్ వాటా కలిగిన ఎల్ఐసీ ఇప్పటికే ఆ ఏర్పాటు చేసింది. ఎల్ఐసీ పాలసీదారులు తమ పాన్ నంబర్, ఆధార్ నంబర్ వివరాలను రెడీగా ఉంచుకుని ఆన్ లైన్ లో లింక్ చేసుకోవచ్చు. ఎల్ఐసీ పోర్టల్ https://www.licindia.in/ వెళితే ముందు భాగంలో ‘లింక్ ఆధార్ అండ్ పాన్ టు పాలసీ’ అని కనిపిస్తుంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. లేదా నేరుగా ఈ లింక్ కు https://www.licindia.in/Home/Link_Aadhaar_and_PAN_to_Policy వెళ్లొచ్చు. ఇక్కడ కనిపించే వివరాలను చదివిన తర్వాత కింది భాగంలో ప్రొసీడ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే తర్వాత పేజీలో పాలసీ నంబర్, ఆధార్ నంబర్, పాన్ నంబర్ తదితర వివరాలు ఎంటర్ చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పాన్ నంబర్ లేని వారు ఫామ్ 60ని సమర్పించాలి. ఆన్ లైన్ విధానంపై అవగాహన లేని వారు తమ ఏజెంట్ ను లేదా సమీపంలోని ఎల్ఐసీ కార్యాలయాన్ని సంప్రదించినా సరిపోతుంది. ఆధార్ జిరాక్స్ కాపీపై సెల్ఫ్ అటెస్టేషన్ చేసి తీసుకెళ్లాలి.

పాన్ నంబర్
representational imageపాన్ నంబర్ కూ ఆధార్ లింక్ చేయడం ఎప్పుడో తప్పనిసరి అయింది. ఇప్పటికీ అనుసంధానం చేసుకోని వారు ఇన్ కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ పోర్టల్ కు నేరుగా వెళితే ఆధార్ లింక్ ఆప్షన్ కనిపిస్తుంది. లేదా https://www.incometaxindiaefiling.gov.in/e-Filing/Services/LinkAadhaarHome.html  ఈ లింక్ కు వెళ్లి పాన్ నంబర్, ఆధార్ నంబర్, ఆధార్ కార్డులో ఉన్న పేరు వివరాలు ఇవ్వడం ద్వారా లింక్ చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్ రూపంలోనూ పాన్ తో ఆధార్ అనుసంధానానికి వీలు కల్పించారు. UIDPAN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి, 12 అంకెల ఆధార్ నంబర్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి, పది అంకెల పాన్ నంబర్ టైప్ చేసి... 567678 కు ఎస్ఎంఎస్ చేయాలి.

సిమ్ కార్డు
representational imageమొబైల్ వాడే ప్రతి ఒక్కరూ తమ పేరిట ఉన్న అన్ని నంబర్లకూ ఆధార్ ధ్రువీకరణ చేసుకోవడం తప్పనిసరి. ఇందుకు ఫిబ్రవరి మొదటి వారం వరకూ గడువు ఉంది. దీన్ని కాస్తంత పొడిగించే అవకాశాలున్నాయి. టెలికం సంస్థలు తమ కస్టమర్లకు ఆధార్ తో రీవెరిఫికేషన్ చేసుకోవాలని కోరుతూ ఎస్ఎంఎస్ లు కూడా పంపిస్తున్నాయి. ఆధార్ నంబర్ ను నోట్ చేసుకుని లేదా ఆధార్ జిరాక్స్ కాపీని వెంట తీసుకొని టెలికం కంపెనీ అధీకృత అవుట్ లెట్ కు వెళ్లి వేలి ముద్రలు ఇవ్వడం ద్వారా ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవచ్చు. వృద్ధులు, వికలాంగులు ఇలా స్టోర్స్ కు వెళ్లి చేసుకోవడం కష్ట సాధ్యం. అందుకే ఐవీఆర్ఎస్ విధానంలో, ఓటీపీ ద్వారా ధ్రువీకరించుకునే విధానాలను ప్రవేశపెట్టేందుకు టెలికం సంస్థలు సన్నద్ధమవుతున్నాయి.


More Articles