ఈ సరికొత్త స్కూటర్లు త్వరలో మనల్ని పలకరించనున్నాయ్

ఒకప్పుడు బైక్స్ హవా. మరి నేడు స్కూటర్లు ఆ స్థానాన్ని క్రమంగా ఆక్రమించేస్తున్నాయి. వాహన ప్రియుల అభిరుచులు సైతం మారిపోతున్నాయి. ముఖ్యంగా పట్టణాల్లో ట్రాఫిక్ మధ్య తరచూ గేర్లు మార్చే ఇబ్బంది పడలేక చాలా మంది గేర్ లెస్ స్కూటర్ల పట్ల మక్కువ చూపుతున్నారు. దీంతో అన్ని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు ఎప్పటికప్పుడు నూతన స్కూటర్ల విడుదలపై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో ప్రముఖ సంస్థల నుంచి వచ్చే ఏడాది, ఏడాదిన్నర కాలంలో పలు నూతన ఉత్పత్తులు రానున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.


ఏథెర్ ఎస్340
representational imageమద్రాస్ ఐఐటీ ఇంజనీరింగ్ పట్టభద్రులైన తరుణ్ మెహతా, స్వప్నిల్ జైన్ ఆవిష్కరణ ఈ ఎలక్ట్రికల్ స్కూటర్. 2013లో ఏథెర్ ఎనర్జీ అనే స్టార్టప్ కంపెనీని ఏర్పాటు చేశారు. మూడేళ్ల పరిశోధన తర్వాత గతేడాది ఏథెర్ ఎస్340 నమూనాను ఆవిష్కరించారు. భవిష్యత్ అంతా ఎలక్ట్రికల్ వాహనాలదే కానుంది. పర్యావరణ కాలుష్యం పతాక స్థాయికి చేరిన నేపథ్యంలో మన దేశంలోనూ కేవలం ఎలక్ట్రికల్ వాహనాలనే అనుమతించాలని కేంద్రం ప్రణాళికలు వేస్తోంది.

2030 నుంచి ఎలక్ట్రికల్ వాహనాలకే అనుమతి అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే ప్రకటించారు. దీంతో వాహన కంపెనీలు ఎలక్ట్రికల్ వెర్షన్ల విడుదలపై దృష్టి నిలిపాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రికల్ వాహనాలపై ఓ కన్నేయాల్సిందే. ఏథెర్ ఎస్340 స్కూటర్ పూర్తిగా దేశీయ విడిభాగాలతో రూపొందించినది. కేవలం ఈ వాహనంలోని లిథియం అయాన్ బ్యాటరీ ఒక్కటే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది.

నిజానికి ఇదేమీ సాదా సీదా స్కూటర్ కాదు. పవర్ ఫుల్ స్కూటరే అని చెప్పాల్సి ఉంటుంది. అధిక శక్తిమంతమైన ఇంజన్ ను ఇందులో ఉపయోగించారు. దీని బాడీలో అధిక శాతం అల్యూమినియం ఉపయోగించడం జరిగింది. మోనోషార్క్ సస్పెన్షన్, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎలక్ట్రికల్ స్కూటర్లలో ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం లేకపోవడం ఓ ప్రతికూలంగా చెప్పుకోవచ్చు. అయితే ఏథెర్ ఎస్340లో బ్యాటరీ కేవలం గంటలోనే 80 శాతం చార్జ్ అవుతుంది. దీంతో వాహనదారులు బ్యాటరీలో పవర్ ఖాళీ అయినప్పటికీ గంటలో చార్జ్ చేసుకుని రైడింగ్ కు వెళ్లొచ్చు. ఇది 2018లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

హీరో డ్యుయెట్ ఇ
representational image2016 ఆటోమొబైల్ ప్రదర్శనలో హీరో మోటోకార్ప్ సంస్థ డ్యుయెట్ ఇ వెర్షన్ స్కూటర్ ను ఆవిష్కరించింది. ప్రస్తుతం మార్కెట్లో డ్యుయెట్ మోడల్ స్కూటర్ ఉంది. దీని డిజైన్ లో స్వల్ప మార్పులు చేసి పూర్తి స్థాయి ఎలక్ట్రికల్ ఇంజన్ తో హీరో మోటో కార్ప్ డ్యుయెట్ ఇ మోడల్ ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఇంటర్ననల్ కంబస్టన్ ఇంజన్ మోడల్ విధానంలో ఇది ఉంటుంది. 5 కిలోవాట్ విద్యుచ్ఛక్తితో ఉన్న మోటార్ ను అమర్చారు. కేవలం 6.5 సెకండ్లలోనే 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని హీరో మోటో కార్ప్ ప్రకటించింది.

అలాగే ఒక్కసారి చార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల వరకూ ప్రయాణించొచ్చు. హీరో సంస్థ ఇంతకు ముందు నుంచే ఎలక్ట్రికల్ స్కూటర్ల తయారీలో ఉంది. దీంతో డ్యుయెట్ కోసం ప్రస్తుత టెక్నాలజీనే ఉపయోగించినట్టు తెలిపింది. డ్యుయెట్ ఈ మోడల్.. లీప్ మోడల్ ఎలక్ట్రికల్ స్కూటర్ కు దగ్గరగా ఉంటుంది. బైక్ చోరీకి గురైతే వెంటనే దాన్ని పట్టించే వ్యవస్థను ఇందులో ఏర్పాటు చేయనుంది. ఇది వచ్చే ఏడాది మార్కెట్ ప్రవేశం చేయనుంది.

టీవీఎస్ ఎన్ టార్క్ 210
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ మోటార్ ఓ స్పెషల్ స్కూటర్ ను వాహన ప్రియుల ముందుకు తీసుకురాబోతోంది. దీని పేరు ఎన్ టార్క్ 210. పెద్ద చక్రాలు, ట్యూబులెస్ టైర్లతో ఇది ఉంటుంది. స్కూటర్ సైజు కూడా సూపర్ బైక్ ను తలపించేలా ఉంది. 2016 ఆటో ఎక్స్ పోలో దీన్ని టీవీఎస్ సంస్థ ప్రదర్శనగా ఉంచింది. దీనిలో కొత్త తరహా టెక్నాలజీని వినియోగించినట్టు సంస్థ పేర్కొంది. ఇందులో రోటో పెటల్ డ్యుయల్ డిస్క్ బ్రేకులు, యాంటీ స్కిడ్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్/ బ్రేక్ వేసినప్పుడు జారిపోకుండా నివారించే వ్యవస్థ) ను ఏర్పాటు చేశారు.

ఇంకా అత్యాధునిక ఎల్ఈడీ లైటింగ్, జీపీఎస్ నావిగేషన్, స్మార్ట్ ఫోన్ అనుసంధానతతో స్మార్ట్ గా ఆన్, ఆఫ్ చేసే సదుపాయం ఉన్నాయి. దూరం ప్రయాణాలకు, రైడింగ్ కు అనుకూలంగా ఉండేలా దీని డిజైన్ ను రూపొందించారు. 212.5 సీసీ లిక్విడ్ కూల్డ్ ఫ్యుయల్ ఇంజెక్టెడ్ ఇంజన్, అత్యాధునిక వేరియో మ్యాటిక్ ట్రాన్సిమిషన్ గేర్ బాక్స్, గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం, 8.5 లీటర్ల ఇంధన ట్యాంకు ఫీచర్లున్నాయి. అలాగే, ఎన్ టార్క్ కాన్సెప్ట్ తోనే 125 సీసీ సామర్థ్యంతో మరో స్కూటర్ ను కూడా టీవీఎస్ తీసుకురానుంది. దీని పేరు ఎన్ టార్క్ 125. హోండా యాక్టివా, సుజుకి యాసెస్ మోడళ్లకు ఇది పోటీ ఇవ్వనుంది.

వెస్పా జీటీఎస్ 300.. చాలా కాస్ట్ లీ
representational imageఇటలీకి చెందిన పియాజియో వెస్పా జీటీఎస్ 300 ప్రీమియం స్కూటర్ ను తీసుకురానుంది. దేశంలో ఖరీదైన స్కూటర్ ఇదే అవుతుంది. ఇది పూర్తిగా దిగుమతి చేసుకుని విక్రయించే మోడల్. పాత వెస్పా మోడల్ ఛాయలు ఇందులో కనిపిస్తాయి. 278సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్, 21 బీహెచ్ పీ సామర్థ్యంతో ఉంటుంది. ఎల్ సీడీ డిస్ ప్లే అదనపు ఆకర్షణ. ట్రాక్షన్ కంట్రోల్, డ్యుయల్ చానల్ ఏబీఎస్ ఉన్నాయి. దీని ధర సుమారు రూ.4 లక్షలు ఉంటుందని అంచనా.

హీరో జెడ్ఐఆర్ 150
ఇది 150సీసీ ఇంజన్ గల స్కూటర్. 150సీసీ స్కూటర్ సెగ్మెంట్ లో అప్రిలియా ఒక్కటే ఉండగా, హీరో మోటో కార్ప్ సైతం అధిక సామర్థ్యం కలిగిన స్కూటర్ సెగ్మెంట్లోకి అడుగు పెడుతోంది. యూరోప్, ఇతర మార్కెట్లలో హోండా విక్రయిస్తున్న పీసీఎక్స్ 150 మోడల్ కు ఇది పోటీ మోడల్ కానుంది. అయితే, పీసీఎక్స్ 150 ఇంకా మన దేశ మార్కెట్లోకి రాలేదు కానీ త్వరలో వస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. జెడ్ఐఆర్150 స్పోర్టీ లుక్ తో మ్యాక్సీ స్కూటర్ నమూనాలో కనిపిస్తుంది. రెండు మోడల్స్ తో ఇది అందుబాటులోకి రానుంది. ఒకటి ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్, యూరోప్ తరహాలో ముందు భాగంలో ఎత్తుతో మరో మోడల్ ను హీరో తీసుకురానుంది. రెండు ప్రొజెక్టర్ల హెడ్ ల్యాంప్, పగలు కూడా వెలిగే లైట్లు, ముందు భాగంలో హ్యాండిల్ వద్ద ప్రొటెక్షన్ స్క్రీన్ తదితర ఫీచర్లు ఉంటాయి. అయితే, ఇది ఎప్పుడొస్తుందన్న దానిపై కచ్చిత సమాచారం లేదు. కానీ, రానున్న ఏడాదిన్నరలో రావచ్చని అంచనాలున్నాయి.

హీరో డేర్
హీరో మోటోకార్ప్ నుంచి డేర్ పేరుతో 125సీసీ స్కూటర్ వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి ప్రవేశించనుంది. 125సీసీ ఎయిర్ కూల్డ్ మిల్ పంపింగ్ 9పీఎస్ పవర్ ఇంజన్ ఇందులో ఉంటుంది. టెలిస్కోపిక్ ఫోర్క్, డిస్క్ బ్రేక్, అలాయ్ వీల్స్, ఎల్ఈడీ డేలైట్, మొబైల్ ఫోన్ చార్జింగ్ సాకెట్, బూట్ లైట్ వంటి పలు వినూత్న ఫీచర్లు ఉన్నాయి. కేవలం సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఇందులో ఉంటుంది.

టీవీఎస్ జూపిటర్ ఎలక్ట్రిక్
representational imageఎలక్ట్రికల్ వాహనాలకు ప్రాధాన్యత పెరుగుతుండడంతో టీవీఎస్ మోటార్ సైతం ఎలక్ట్రికల్ స్కూటర్ తయారీపై దృష్టి సారించింది. టీవీఎస్ జూపిటర్ మోడల్ లోనే ఎలక్ట్రికల్ వేరియంట్ ను 2018 ప్రారంభంలో తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో చాలా వరకు విడిభాగాలు టీవీఎస్ జూపిటర్ వే ఉండనున్నాయి. డిజైన్, సస్పెన్షన్ కూడా జూపిటర్ ను పోలి ఉంటాయి. ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పరీక్షల దశలో ఉన్నట్టు సమాచారం. ఇందులో ఉన్న ఫీచర్ల వివరాలను టీవీఎస్ ఇంత వరకు బయటపెట్టలేదు. ధర మాత్రం ప్రస్తుత జూపిటర్ స్థాయిలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మహింద్రా ఎలక్టిక్ స్కూటర్
మహింద్రా అండ్ మహింద్రా గస్టో మోడల్ లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురావాలనుకుంటోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పనిని ప్రారంభించింది. ఎలక్ట్రిక్ స్కూటర్ అభివృద్ధిలో కంపెనీ ఇంజనీర్లు ముందస్తు దశలో ఉన్నారని తెలుస్తోంది. 2018 ప్రారంభంలో దీన్ని విడుదల చేయనున్నట్టు సమాచారం.

అప్రిలియా 125సీసీ
representational imageఅప్రిలియా 150ఎస్ఆర్ ఇప్పటికే పాప్యులర్ కాగా, ఇందులోనే 125సీసీ మోడల్ తీసుకొచ్చే ఆలోచనతో కంపెనీ ఉంది. జనవరిలో జరిగే ఆటో ఎక్స్ పోలో దీన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. దీని ధర రూ.55,000 స్థాయిలో ఉంటుందని అంచనా.


More Articles