విద్యార్థులకు సీజనల్ వ్యాధులు రాకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి: మంత్రి కొప్పుల ఈశ్వర్

  • వారిని సొంత బిడ్డల మాదిరిగా చూసుకోవాలి
  • షేక్ పేట ఎస్సీ గురుకులాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి
  • విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, ఉన్నతంగా తీర్చిదిద్దాలి
  • విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి కొప్పుల
హైదరాబాద్: విద్యార్థులకు సీజనల్ వ్యాధులు సోకకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. గోల్కోండ సమీపాన ఉన్న షేక్ పేట ఎస్సీ గురుకుల బాలుర పాఠశాల, జూనియర్ కాలేజీని (సెంటర్ ఫర్ ఎక్సెలెస్-COE ) మంత్రి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, కిచెన్, డైనింగ్ హాల్, బాత్రూమ్స్, కారిడార్స్,పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఉపాధ్యాయులను పలు సూచనలు చేశారు. 

ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల ఆలనాపాలన గురించి ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు దూరంగా ఉండి ఇక్కడ చదువుకుంటున్నారని, వీరిని మీ సొంత బిడ్డల మాదిరిగా చూసుకోవాలని, వీరి ఆలనాపాలన బాధ్యతంతా మీపైనే ఉంటుందన్నారు. విద్యార్థులకిచ్చే తాగునీటిని కాచి వడబోసి గోరువెచ్చగా, భోజనాన్ని వేడివేడిగా అందించాలని ఆదేశించారు. గురుకుల విద్యా విధానంలో మన తెలంగాణ దేశమంతటికి ఆదర్శమని, ఇక్కడ చక్కని విద్యాబుద్ధులతో పాటు పోషకాహారాన్ని ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. ఒక్కొక్క విద్యార్థిపై ప్రతి ఏటా లక్షా 25వేల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు.

చక్కని ఫలితాలు కూడా వస్తున్నాయని, అన్ని రంగాలలో బాగా రాణిస్తున్నారని మంత్రి కొప్పుల చెప్పారు. వీరిపై మరింత శ్రద్ధ చూపి ఉత్తమ పౌరులుగా, ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మంత్రి తరగతి గదులు, కిచెన్, డైనింగ్ హాల్, వెల్ నెస్ సెంటర్, ఇండోర్ స్టేడియం, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మాటామంతీ జరిపారు. బోధన జరుగుతున్న తీరు, వడ్డిస్తున్న భోజనం, ఉపాధ్యాయులు చూపుతున్న శ్రద్ధాసక్తులు, అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. 

More Press News