అగ్ర దర్శకులు తమ సొంత నిర్మాణ సంస్థలో సినిమాలు నిర్మించడం కొత్తేమీ కాదు. ఇప్పుడు ఆ వరుసలోనే పాన్‌ ఇండియా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా తన బ్యానర్‌ భద్రకాళి సంస్థపై నిర్మించిన చిత్రం 'రోమాంచకం'. సుమంత్‌ ప్రభాస్‌, అనంతిక సనీల్‌ కుమార్‌ జోడీగా నటించిన ఈ సినిమాకు వేణుగోపాల్ రెడ్డి దర్శకుడు. ప్రచారం చిత్రాలతో, పబ్లిసిటీతో అలరించిన ఈ సినిమా యూత్‌లో మంచి బజ్‌ను తెచ్చుకుంది. ఇక ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది?  'రోమాంచకం' ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేసిందా? అనేది సమీక్షలో తెలుసుకుందాం. 

అన్వేష్‌ (సుమంత్‌ ప్రభాస్‌) ఫ్రెండ్స్‌తో కలిసి ఒక స్టార్టప్‌ కంపెనీని ప్రారంభించే ట్రయల్స్‌లో ఉంటాడు.ఇందులో భాగంగానే 'రోమాంచకం'పేరుతో డేటింగ్‌ యాప్‌ను డెవలప్ చేస్తుంటాడు. అమ్మాయిలు, అబ్బాయిల మధ్య రిలేషన్స్‌, ఒకరికొకరు సహకరించుకోవడం, ఒకరి అవసరాలు మరొకరు తీర్చడమే ఈ డేటింగ్‌ యాప్‌ లక్ష్యం అని చెప్పి ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటాడు. అయితే ఇదే యాప్‌ ద్వారానే చెన్నైకి చెందిన మైథిలి (అనంతిక సనీల్‌కుమార్‌) అనే అమ్మాయితో అతనికి పరిచయం ఏర్పడుతుంది. 

ఈ పరిచయం ఇద్దరి మధ్య మరింత స్ట్రాంగ్‌ అవుతుంది. మైథిలి పుట్టినరోజున ఆమెని సర్‌ప్రైజ్‌ చేయాలని చెన్నై వెళతాడు. ఓ హోటల్‌లో ఉన్న అన్వేష్‌ని మైథిలి కలుస్తానని చెబుతుంది. కానీ మైథిలి హోటల్‌కు రాకుండా ఫోన్‌ స్వీచ్చాఫ్‌ చేసి, సోషల్ మీడియా అకౌంట్లలోనూ అన్వేష్‌ని బ్లాక్‌ చేసేస్తుంది. అయితే మైథిలి హోటల్‌కు రాకపోవడానికి కారణం ఏమిటి? ఆమె కనిపించకపోవడానికి కారణమేమిటి? ఆమె మళ్లీ తిరిగొచ్చిందా? లేదా? అన్వేష్‌, మైథిలి పెళ్లి చేసుకున్నారా? లేదా? అనేది మిగతా కథ. 

ఈ సినిమా ఉపశీర్షిక.. ప్రేమ, హాస్యం.. ఉత్కంఠ అనే తగ్గట్టుగా దర్శకుడు ఈ మూడు అంశాలను మిక్స్‌ చేసి కథ రాసుకున్నాడు.అయితే ఇందులో హాస్యం మీదనే దర్శకుడు ఎక్కువగా ఫోకస్‌ పెట్టాడు. ప్రతి సన్నివేశంలో వినోదాన్ని పండించే ప్రయత్నం చేశాడు. అయితే ప్రేమకథ, ఉత్కంఠ అంశాలపై పెద్దగా శ్రద్ద పెట్టలేదు. హీరో లక్ష్యమైనా స్టార్టప్‌ కంపెనీతో మొదలైన కథలో ఆ తరువాత దాని ఊసే ఉండదు. ఫ్రెండ్స్‌ మధ్య సరదా సంభాషణలు, హీరో, హీరోయిన్‌ల మధ్య ఫోన్‌ సంభాషణలుతో కథ నడుస్తుంటుంది. 

అయితే హీరో, హీరోయిన్‌ మధ్య వచ్చే సన్నివేశాలు అంత లాజిక్‌గా అనిపించవు. ఆ సన్నివేశాలు కూడా పెద్దగా ఆకట్టుకోవు. ఇలాంటి మైనస్‌లు ఆలోచించే లోపే వచ్చే ఎంటర్‌టైన్‌మెంట్‌ సీన్స్‌ ఈ మైనస్‌లను కవర్‌ చేసే విధంగా కడుపుబ్బా నవ్విస్తాయి. జెన్‌జీ కుర్రాళ్ల అల్లరి, వాళ్ల సరదా డైలాగులు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్న అందిస్తాయి. ఫస్టాఫ్‌ వరకు సరదాగా, చిన్న ఉత్కంఠతో ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లోనే దర్శకుడికి అసలైన చాలెంజ్‌. సెకండాఫ్‌లో దర్శకుడు అసలు కథలోకి వెళతాడా? ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి ప్రేక్షకులకు కలుగుతుంది. అయితే సెకండాఫ్‌లో కూడా ఉత్కంఠ, ప్రేమ అంశాలపై కంటే వినోదం వైపే మొగ్గు చూపాడు దర్శకుడు. 

ఉపేంద్ర లిమాయేని పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌గా చూపించి కామెడీ పండించే ప్రయత్నం చేసినా అది గందరగోళంగా అనిపిస్తుంది. అతను కనిపించే సన్నివేశాల్ని పెద్ద సౌండ్‌లతో స్క్రీన్‌ అంతా హడావుడిగా కంగాళి ఫీల్‌ కలుగుతుంది. సెకండాఫ్‌లో కూడా ఫ్రెండ్స్‌ మధ్య వచ్చే కామెడీ, రిజనల్‌ ఫీలింగ్‌తో వచ్చే సాంబార్‌, బిరియానీ, మటన్‌ సంభాషణలకు హిలేరియస్‌గా నవ్వుకుంటారు.

సుమంత్‌ ప్రభాస్‌ నటనలో ఈజ్‌ కనిపించింది. అనంతిక సనీల్‌కుమార్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ బాగుంది. ఇద్దిర పెయిర్‌ కూడా క్యూట్‌గా ఉంది.  సుమంత్‌ ప్రభాస్‌ కామెడీ, ఫ్రస్టేషన్‌ మిక్స్‌డ్‌ సీన్స్‌ల్లో అక్కడక్కడా మెప్పించిన.. నటనలో ఇంకా బెటర్‌ అవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా హీరో ఫ్రెండ్స్‌ గా నటించిన వెంకటేష్‌, నరేంద్ర రవి, మణి, సోహన్‌ మంచి వినోదాన్ని పండించారు.ఇందులో నరేంద్ర రవి నటన, అతని సంభాషణలు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.  రాధారమణ పాట చిత్రీకరణ బాగుంది. 

దర్శకుడు కథను సింపుల్‌గా రాసుకున్నా వినోదాత్మక సంభాషణలు అలరించే విధంగా తీర్చిదిద్దుకున్నాడు. దర్శకుడు హాస్యంపై పెట్టిన దృష్టి, ప్రేమ, ఉత్కంఠ అంశాలపై కూడా పెట్టి ఉంటే సినిమా మరింత గ్రిప్పింగ్‌ అనిపించేంది. ఓవరాల్‌గా ఈ రోమాంచకం వినోదాత్మక చిత్రాలను ఇష్టపడే వారికి,  కథ, లాజిక్‌లు, ట్విస్ట్‌లు  అని ఆలోచించకుండా కేవలం వినోదాన్ని ఆశిస్తే మాత్రం 'రోమాంచకం' సంతృప్తినిస్తుంది.