బైక్ లవర్స్కు గుడ్న్యూస్.. మార్కెట్లోకి కొత్త నింజా 500
- 2026 కవాసాకీ నింజా 500 భారత మార్కెట్లో విడుదల
- ఎక్స్షోరూమ్ ధర రూ.5.76 లక్షలు
- కొత్తగా లైమ్ గ్రీన్ కలర్ ఆప్షన్
- 451 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్ కొనసాగింపు
- డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు
- గత మోడల్తో పోలిస్తే రూ.10 వేల ధర పెంపు
కొత్త నింజా 500లోని ప్రధాన మార్పు ఈ20 ఇంధనానికి అనుకూలంగా మార్చడం. అంటే 20 శాతం ఇథనాల్ కలిసిన పెట్రోల్తో కూడా ఈ బైక్ను నడపవచ్చు. పర్యావరణ హిత ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కంపెనీ ఈ మార్పు చేసింది. అలాగే కవాసాకీకి గుర్తింపుగా నిలిచిన లైమ్ గ్రీన్ కలర్ స్కీమ్ను కూడా ఈ మోడల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. స్పోర్టీ లుక్ను మరింత ఆకర్షణీయంగా మార్చేలా ఈ రంగును రూపొందించింది.
బైక్లో అదే 451 సీసీ లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ను కొనసాగించింది. ఈ ఇంజిన్ సుమారు 45 హెచ్పీ శక్తి, 42.6 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6స్పీడ్ గేర్బాక్స్ను జత చేసింది. అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ కూడా స్టాండర్డ్గా అందిస్తోంది. నగర రోడ్లపై, హైవేలపై బ్యాలెన్స్ రైడింగ్ అనుభూతిని అందించేలా ఇంజిన్ను రూపొందించారు.
ఫీచర్ల పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. డిజిటల్ ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ, రైడాలజీ యాప్ సపోర్ట్ ఇందులో ఉన్నాయి. ఎల్ఈడీ లైటింగ్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ను కూడా కొనసాగించింది. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ను అమర్చింది. రెండు చక్రాలకూ డిస్క్ బ్రేకులు అందించింది.
గత మోడల్తో పోలిస్తే కొత్త నింజా 500 ధరను రూ.10 వేలు పెంచింది. ప్రస్తుతం దీని ధర రూ.5.76 లక్షలుగా ఉంది. పూర్తిగా విదేశాల్లో తయారై భారత్కు దిగుమతి అవుతున్న సీబీయూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) మోడల్ కావడం వల్ల ధర ఎక్కువగా ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.