ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు చైనా సాయం.. మాకు ముందే తెలుసు: భారత్

Indias Reputation Standing Reply To China On Site Support To Pak
  • పాకిస్థాన్‌కు క్షేత్రస్థాయిలో సాంకేతిక సాయం అందించినట్లు చైనా అంగీకారం
  • చైనాకు చెందిన ఇంజినీర్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు కథనాలు
  • బాధ్యతాయుతంగా ఉన్నామని చెప్పే దేశాలు ఉగ్రవాద దేశాలకు అండగా నిలుస్తున్నాయని భారత్ చురక
గత సంవత్సరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు చైనా సాంకేతిక సాయం అందించిందన్న వార్తలపై భారత్ స్పందించింది. గతంలో తమకు తెలిసిన విషయాలనే ఈ నివేదికలు ధృవీకరిస్తున్నాయని పేర్కొంది. ఈ విషయంలో బీజింగ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించింది.

పాకిస్థాన్‌కు చైనా సహకరించిందనే కథనాలను తాము చూశామని, కానీ ఈ విషయం తమకు ముందే తెలుసని విదేశాంగ శాఖ తెలిపింది. బాధ్యతాయుతంగా ఉన్నామని ప్రకటించుకునే కొన్ని దేశాలు ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న దేశాలకు మద్దతు పలకడం తగదని హితవు పలికింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా చేపట్టిందని తెలిపింది.

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయడమే ఆపరేషన్ సిందూర్ లక్ష్యమని తెలిపింది. మన సైన్యం అదే పని చేసిందని తెలిపింది. అలాంటి ఉగ్ర స్థావరాలను రక్షించేందుకు సాయం చేయడం సరైనదో కాదో ఆయా దేశాలే ఆలోచించుకోవాలని కోరింది.

కాగా, గత సంవత్సరం భారత్‌తో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్‌కు క్షేత్రస్థాయిలో సాంకేతిక సాయం అందించినట్లు చైనా అంగీకరించింది. ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనాకు చెందిన ఒక ఇంజినీర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ఆ దేశ అధికార మీడియా సీసీటీవీ ఓ కథనం ప్రసారం చేసింది.
Go Back to Shorts
Indias Reputation Standing Reply To China On Site Support To Pak
Pahalgam attack
Operation Sindoor

More Telugu News