గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనార్ సత్కారం

VC Sajjanar Praises Father Son Duo Who Exposed Gas Theft
  • సిలిండర్ల నుంచి గ్యాస్ చోరీ చేస్తున్న వారిని పట్టించిన తండ్రీకొడుకులు
  • ప్రశంసాపత్రంతో పాటు నగదు పురస్కారం అందజేత
  • అక్రమాలపై ప్రతిపౌరుడు ఇలాగే చైతన్యంతో స్పందించాలన్న సజ్జనార్
కస్టమర్లకు న్యాయంగా చేరాల్సిన గ్యాస్ సిలిండర్ల నుంచి గ్యాస్ చోరీ చేస్తున్న దొంగలను పట్టించిన తండ్రీకొడుకులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అభినందించారు. ధైర్యంగా గ్యాస్ మాఫియా గుట్టురట్టు చేయడాన్ని కొనియాడుతూ, శనివారం బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేసి, పౌర చైతన్యానికి మారుపేరుగా నిలిచారని ప్రశంసించారు.

సమాజంలో జరుగుతున్న అక్రమాలపై ప్రతి పౌరుడు ఇలాగే చైతన్యంతో స్పందించినప్పుడే నేరరహిత సమాజం నిర్మించగలమని ఆయన పేర్కొన్నారు.

ఏం జరిగిందంటే?

చుడీబజార్‌కు చెందిన వ్యాపారి అశోక్ తివారీ గత నెల 21న గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేశారు. డెలివరీ సమయంలో బరువు తక్కువగా ఉండటాన్ని ఆయన కుమారుడు 16 ఏళ్ల నమాన్ తివారి  గమనించారు. గత డెలివరీ సమయంలోనూ ఇలాగే సిలిండర్ రెండు కిలోలు తక్కువగా ఉందని తన తండ్రి దృష్టికి  తీసుకెళ్లారు. నిబంధనల ప్రకారం 30.4 కిలోలు ఉండాల్సిన సిలిండర్, కేవలం 28 కిలోల బరువు మాత్రమే ఉండటం గుర్తించారు.

గత కొంతకాలంగా గ్యాస్ త్వరగా అయిపోతుండటంతో అనుమానం వచ్చి బరువు తనిఖీ చేయగా, సుమారు రెండు కిలోల గ్యాస్ తక్కువగా ఉన్నట్లు తేలింది. తనకు గ్యాస్ సిలిండర్‌ను సరఫరా చేసే సిద్ధార్థ ఎంటర్‌ప్రైజెస్ ఏజెన్సీ ప్రతినిధులను ప్రశ్నించగా వారు దురుసుగా సమాధానం ఇచ్చినట్లు ఆరోపించారు. ఆ తర్వాత తండ్రీకొడుకులు గ్యాస్ తక్కువ రావడం గురించి ఆరా తీశారు. సదరు ఏజెన్సీ ఉద్యోగులు గ్యాస్‌ సిలిండర్లను జుమేరాత్ బజార్‌లోని ఒక ఇంట్లో అక్రమంగా చిన్న సిలిండర్లలోకి, వాణిజ్య అవసరాల కోసం రీఫిల్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు.

బహిరంగ ప్రదేశాల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ గోషామహల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేవలం గ్యాస్ తక్కువగా ఇవ్వడమే కాకుండా, జనసమ్మర్ద ప్రాంతంలో అత్యంత ప్రమాదకర రీతిలో రీఫిల్లింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సిద్దార్థ ఎంటర్ ప్రైజెస్ ఏజెన్సీతో పాటు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసుకు సంబంధించి సాయి కుమార్, వినీత్ కుమార్, పూస గణేశ్, ప్రవీణ్ కుమార్, అమిత్ కుమార్‌లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు కమర్షియల్, ఏడు డొమెస్టిక్, 12 చిన్న సిలిండర్లతో పాటు రీఫిల్లింగ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

పౌర బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించి, గ్యాస్ ఏజెన్సీల అక్రమదందాను వెలుగులోకి తెచ్చిన తండ్రీకొడుకులను సీపీ వీసీ సజ్జనర్ ప్రశంసించారు. "యూనిఫామ్ లేని పోలీసులా వ్యవహరించి, వ్యవస్థలోని అక్రమాలను ధైర్యంగా ప్రశ్నించిన వీరు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయులు. అక్రమార్కులు సామాన్యుల కష్టార్జితాన్ని దోచుకోవడమే కాకుండా, రీఫిల్లింగ్ పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే చూస్తూ ఊరుకోకూడదని నిరూపించారు. ప్రతి పౌరుడు ఇంతే చైతన్యంతో స్పందిస్తే నేరస్తులు సమాజంలో తలదాచుకోలేరు. ఇలాంటి బాధ్యతాయుతమైన వ్యక్తులకు పోలీసు శాఖ ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటుంది" అని ఆయన అన్నారు.

వినియోగదారులు కూడా తమకు అందే వస్తువుల నాణ్యత, పరిమాణంపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ కు పాల్పడేవారిపై హైదరాబాద్ సిటీ పోలీస్ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఎక్కడైనా మోసం జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే డయల్ 100 గానీ, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
Go Back to Shorts
VC Sajjanar
Hyderabad Police
Gas theft
Ashok Tiwari
Naman Tiwari
Siddhartha Enterprises
Gas cylinder

More Telugu News