అషురెడ్డి కేసు.. మీడియాకు, కంటెంట్ క్రియేటర్లకు హైకోర్టు కీలక ఆదేశాలు
- కొన్ని రోజులుగా వివాదంలో చిక్కుకున్న అషురెడ్డి
- అషుకు సంబంధించిన నిరాధార వార్తలను ప్రసారం చేయవద్దన్న హైకోర్టు
- అషు ప్రైవసీని గౌరవించాలన్న న్యాయస్థానం
సినీ నటి అషురెడ్డి చుట్టూ గత కొద్దిరోజులుగా నెలకొన్న వివాదంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆమెకు పెద్ద ఊరటనిచ్చింది. సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థల్లో తనపై వస్తున్న కథనాలపై ఆమె న్యాయపోరాటం చేస్తూ, చివరకు కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులను సాధించారు.
హైదరాబాద్కు చెందిన ఎన్నారై ధర్మేంద్ర ఫిర్యాదుతో సీసీఎస్లో నమోదైన కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఈ తరుణంలో తన పరువుకు భంగం కలిగించేలా, తన వ్యక్తిగత జీవితంపై నిరాధారమైన వార్తలను ప్రచారం చేయకుండా ఆదేశించాలని అషురెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో, అషురెడ్డికి సంబంధించిన నిరాధారమైన విషయాలను ప్రసారం చేయకూడదని తెలంగాణ హైకోర్టు మీడియాను, కంటెంట్ క్రియేటర్లను ఆదేశించింది. ఆమె ప్రైవసీని గౌరవించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
కోర్టు ఉత్తర్వుల అనంతరం అషురెడ్డి ఇన్స్టాగ్రామ్లో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని, నిరాధారమైనవని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే ప్రసారమైన అభ్యంతరకర పోస్టులను వెంటనే తొలగించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి, ఇంకా తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తన ప్రైవసీకి భంగం కలిగించవద్దని మీడియాను, నెటిజన్లను కోరుతూనే, తనకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు.