సజ్జనార్ ను కలిసిన మంగ్లీ.. సుబ్బారావుపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నపం
- కొన్ని రోజులుగా మంగ్లీ, అడ్వకేట్ సుబ్బారావు మధ్య వివాదం
- ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఇద్దరూ కేసులు పెట్టుకున్న వైనం
- తనపై దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని సజ్జనార్ను కోరిన మంగ్లీ
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ను సినీ గాయని మంగ్లీ కలిశారు. అడ్వకేట్ సుబ్బారావుకు, మంగ్లీకి మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, మైక్రోఫైనాన్స్ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని కోరుతూ మంగ్లీ తాజాగా సీపీ సజ్జనార్ను కలిసి ఫిర్యాదు చేశారు.
మైక్రోఫైనాన్స్ పేరుతో తాను, తన తమ్ముడు మోసాలకు పాల్పడ్డామన్న సుబ్బారావు ఆరోపణలను ఈ సందర్భంగా మంగ్లీ ఖండించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న సుబ్బారావుపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే మోసపోయిన బాధితులకు న్యాయం చేసి అసలు దోషులను పట్టుకోవాలని కోరారు.
గత నెల 22న సుబ్బారావు తనను కలిసి, సోషల్ మీడియాలో ఉన్న నెగెటివ్ వీడియోలను తొలగించాలంటే రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని మంగ్లీ ఆరోపించారు. అందుకు తాను నిరాకరించడంతోనే ఈ వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. తనకు పాటలు తప్ప వేరే వ్యాపారాలు లేవని, డబ్బుల కట్టలతో ఉన్న వీడియోలో ఉన్నది తన తమ్ముడు కాదని మంగ్లీ స్పష్టం చేశారు. ఒకవేళ తన తప్పు ఉందని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు. సుబ్బారావు కేవలం ఫేమస్ కావడానికే తన పేరును వాడుకుంటున్నారని మంగ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు, నిన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బాధితులతో కలిసి హంగామా చేసిన సుబ్బారావుకు పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించగా, 27 ఎంజీ రీడింగ్ వచ్చింది. మద్యం సేవించి స్టేషన్లో ఆయన ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.