West Bengal Elections: 25 ఏళ్ల తర్వాత... బెంగాల్‌లో కేవలం రెండు విడతల్లోనే ఎన్నికలు

West Bengal Elections to be held in two phases after 25 years
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో పాతికేళ్ల తర్వాత కీలక మార్పు చోటుచేసుకుంది. 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను కేవలం రెండు దశల్లోనే నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. గత 25 ఏళ్లలో ఇంత తక్కువ దశల్లో బెంగాల్ ఎన్నికలు జరగడం ఇదే ప్రథమం. చివరిసారిగా 2001లో రాష్ట్రంలో ఒకే దశలో పోలింగ్ జరిగింది.

ఆ తర్వాత జరిగిన ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ దశల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2006లో ఐదు, 2011లో ఆరు, 2016లో ఏడు, 2021లో ఎనిమిది దశల్లో పోలింగ్ నిర్వహించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా బెంగాల్‌లో ఏడు దశల్లో పోలింగ్ జరిపిన విషయం తెలిసిందే. సుదీర్ఘ కాలం తర్వాత దశల సంఖ్యను తగ్గించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ నిర్ణయంపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మాట్లాడుతూ, "సంబంధిత వర్గాలన్నింటితో చర్చించిన తర్వాతే ఈసారి పశ్చిమ బెంగాల్ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించాలని నిర్ణయించాం. ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పూర్తిగా హింసారహితంగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తాం" అని స్పష్టం చేశారు.

ఇటీవల ఈసీ ఫుల్ బెంచ్ బెంగాల్‌లో పర్యటించినప్పుడు, అధికార తృణమూల్ కాంగ్రెస్ మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఒకటి లేదా రెండు దశల్లోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశాయి. తాజా ప్రకటనతో ఎన్నికల సంఘం ప్రతిపక్షాల సూచనను పరిగణనలోకి తీసుకున్నట్లయింది. ఈ నేపథ్యంలో, శాంతియుత పోలింగ్ కోసం అవసరమైన కేంద్ర సాయుధ పోలీసు బలగాల మోహరింపుపై ఇప్పుడు దృష్టి కేంద్రీకృతమైంది. 

ఏడు దశల్లో జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికలకు 1,099 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. ఇప్పుడు రెండు దశల్లోనే ఎన్నికలు జరగనుండటంతో, సుమారు 2,250 నుంచి 2,500 కంపెనీల బలగాలు అవసరమవుతాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) కార్యాలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
West Bengal Elections
Bengal Assembly Elections
Indian Election Commission
Gyanesh Kumar
TMC
Election phases
Lok Sabha Elections 2024
Central Armed Police Forces
West Bengal CEO

More Telugu News