Vairamuthu: తమిళ సినీ గీత రచయిత వైరముత్తుకు ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్ అవార్డు

Vairamuthu to Receive Jnanpith Award for Tamil Literature
ప్రముఖ తమిళ కవి, సినీ గీత రచయిత ఆర్. వైరముత్తు దేశ అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞానపీఠ్‌కు ఎంపికయ్యారు. 2025 సంవత్సరానికి గాను 60వ జ్ఞానపీఠ్ అవార్డుకు ఆయనను ఎంపిక చేసినట్టు భారతీయ జ్ఞానపీఠ్ సంస్థ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. తమిళ సాహిత్యానికి ఆయన అందించిన విశేష సేవలు, సృజనాత్మకతకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్టు పేర్కొంది.

ప్రముఖ రచయిత్రి ప్రతిభా రే అధ్యక్షతన సమావేశమైన భారతీయ జ్ఞానపీఠ్ సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. 1953లో తమిళనాడులో జన్మించిన వైరముత్తు, నాలుగు దశాబ్దాలుగా సాహితీ రంగంలో తనదైన ముద్ర వేశారు. కవిత్వం, నవలలతో కలిపి ఆయన 37కు పైగా పుస్తకాలను రచించారు. 'కళ్ళికాట్టు ఇతిహాసం', 'కరువాచ్చి కావియం', 'తన్నీ దేశం' వంటివి ఆయన ప్రసిద్ధ రచనలలో కొన్ని. 

ఇక సినీ గీత రచయితగా ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక హిట్ గీతాలతో తనకంటూ ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్నారు. వైరముత్తు తన కెరీర్‌లో ఇప్పటికే ఎన్నో ఉన్నత పురస్కారాలు అందుకున్నారు. ఏడుసార్లు ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. భారత ప్రభుత్వం ఆయనను 2003లో పద్మశ్రీ, 2014లో పద్మభూషణ్‌తో సత్కరించింది. ఆయన రాసిన 'కళ్ళికాట్టు ఇతిహాసం' నవలకు సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది.

ఇప్పటివరకు తమిళ సాహిత్యం నుంచి పి.వి. అఖిలన్ (1975), డి. జయకాంతన్ (2002) మాత్రమే జ్ఞానపీఠ్ పురస్కారం అందుకున్నారు. వారి తర్వాత ఈ గౌరవాన్ని దక్కించుకున్న మూడో తమిళ రచయితగా వైరముత్తు నిలిచారు. ఈ అవార్డు కింద రూ.11 లక్షల నగదు బహుమతి, వాగ్దేవి కాంస్య విగ్రహం, ప్రశంసాపత్రం అందజేస్తారు.
Vairamuthu
Tamil writer
Jnanpith Award
Tamil literature
Kollywood lyricist
Sahitya Akademi Award
Padma Bhushan
Indian literature
Tamil Nadu
national award

More Telugu News