Uttam Kumar Reddy: గ్యాస్ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy clarifies no gas shortage in Telangana
తెలంగాణలో గ్యాస్ సిలిండర్ల కొరత ఉందంటూ వస్తున్న వదంతులపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. గ్యాస్ కొరతపై నెలకొన్న అపోహల నేపథ్యంలో మంత్రి ఇవాళ‌ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు, సరఫరా పరిస్థితిపై మంత్రి కూలంకషంగా సమీక్షించారు. ప్రజల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. గృహ వినియోగదారులతో పాటు ఆసుప‌త్రులు, ప్రభుత్వ హాస్టళ్లకు సరిపడా గ్యాస్ సరఫరా అయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. ఎక్కడా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు.
Uttam Kumar Reddy
Telangana gas shortage
Gas cylinders
Civil Supplies Department
Black market
Gas supply
Telangana government
Cooking gas
LPG cylinders

More Telugu News