Moshen Raju: వైసీపీ సభ్యులపై అసహనం వ్యక్తం చేసిన శాసనమండలి చైర్మన్
- గీతం యూనివర్సిటీ భూములపై వాయిదా తీర్మానం ఇచ్చిన వైసీపీ
- వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన మండలి చైర్మన్
- నినాదాలతో సభను హోరెత్తించిన వైసీపీ సభ్యులు
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఈ ఉదయం ప్రారంభం కాగానే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గీతం యూనివర్సిటీకి సంబంధించి సుమారు రూ. 5 వేల కోట్ల భూ దోపిడీ జరిగిందని, దీనిపై తక్షణమే చర్చించాలని కోరుతూ వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ సభ్యులు ప్లకార్డులతో పోడియం వద్దకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు.
వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై చైర్మన్ మోషేన్ రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "ప్రతిరోజూ సభను అడ్డుకోవడం మీకు అలవాటుగా మారింది" అని ఆయన ఫైర్ అయ్యారు. వాయిదా తీర్మానం ఆమోదం పొందదని ముందే తెలిసినప్పటికీ, కావాలనే నిరసనలు చేస్తూ సభా సమయాన్ని వృథా చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అయినా సభ్యులు శాంతించకపోవడంతో, ఆ గందరగోళం మధ్యే చైర్మన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే, ప్రతిపక్ష సభ్యుల నినాదాలు హోరెత్తడంతో సభను నిర్వహించడం సాధ్యం కాక, చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.