Revanth Reddy: మాజీ మావోయిస్టు అగ్రనేతలతో సీఎం రేవంత్ భేటీ.. పునరావాసంపై కీలక హామీ

Revanth Reddy to Announce Maoist Leaders Surrender in Assembly
  • చట్టపరిధిలో వారు ఏమైనా చేసుకోవచ్చన్న ముఖ్యమంత్రి
  • చట్టాలను ఉల్లంఘిస్తే మాత్రం ప్రభుత్వం తన పని తాను చేస్తుందని వ్యాఖ్య
  • ప్రస్తుత పరిస్థితుల్లో తుపాకీ పట్టుకుంటే నడవదని మాజీ మావోయిస్టు కీలక వ్యాఖ్య
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం సచివాలయంలో మాజీ మావోయిస్టు అగ్రనేతలతో సమావేశమయ్యారు. జనజీవన స్రవంతిలో కలిసిన వారి అభ్యర్థన మేరకు ఏర్పాటు చేసిన ఈ భేటీలో సీఎం వారితో సుదీర్ఘంగా చర్చించారు. హింస ద్వారా ఏ సమస్యకూ శాశ్వత పరిష్కారం లభించదని, ప్రజాస్వామ్య మార్గంలోనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

దశాబ్దాల పాటు అడవుల్లో గడిపి, ప్రజాస్వామ్యంపై నమ్మకంతో తిరిగి రావడం అభినందనీయమని సీఎం అన్నారు. సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు ప్రభుత్వం తరఫున పూర్తి రక్షణ కల్పిస్తామని, పునరావాస విషయంలో ఎలాంటి లోటు ఉండదని భరోసా ఇచ్చారు. పొరుగు రాష్ట్రాల్లోని పునరావాస విధానాలను పరిశీలించి, లొంగిపోయిన వారికి మరింత మెరుగైన ప్యాకేజీని అందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో గత రెండేళ్లలో మావోయిస్టుల పునరావాస పురోగతిని డీజీపీ బి. శివధర్ రెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. ప్రభుత్వ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 591 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారని తెలిపారు. పోలీసు శాఖ కృషి, మెరుగైన పునరావాస విధానాల వల్ల అగ్రనేతల్లోనూ మార్పు వస్తోందని ఆయన పేర్కొన్నారు.

సీఎంను కలిసిన వారిలో మాజీ మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులు తిపిరి తిరుపతి (దేవుజీ), మల్లా రాజిరెడ్డి, పుల్లూరి ప్రసాద్ రావు, పొతుల పద్మావతితో పాటు మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు బడే చొక్కారావు, నూనే నర్సింహారెడ్డి వంటి కీలక నేతలు ఉన్నారు. సాయుధ పోరాటాన్ని వీడి సాధారణ జీవితం గడిపేందుకు అవకాశం కల్పించినందుకు వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అత్యంత స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ భేటీలో వారు చేసిన విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, కె. కేశవరావు, సీఎస్ రామకృష్ణారావు, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తుపాకీ పట్టుకుంటే నడవదు: దేవ్‌జీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం మాజీ మావోయిస్టు దేవ్‌జీ కీలక వ్యాఖ్యలు చేశారు. రివార్డు పాలసీని కోటి రూపాయలకు పెంచాలని ఆయన కోరారు. తమకు ఐదెకరాల భూమి ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. భూమి సాధ్యం కాదని ముఖ్యమంత్రి చెప్పారని, కానీ ఇల్లు, ఉద్యోగం, జీవనభృతిపై హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం అనుమతిస్తే జైళ్లలో ఉన్న మావోయిస్టులను కలిసి, ఆ తర్వాత లొంగుబాట్లపై అందరం కలిసి ప్రజలకు బహిరంగ లేఖ రాస్తామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తుపాకీ సిద్ధాంతం నడవదని ప్రజలకు వివరిస్తామని అన్నారు.
Revanth Reddy
Telangana
Maoists
Devji
Malla Raji Reddy
Nune Narasimha Reddy
Surrender

More Telugu News