Kutumba Rao: ఆ రాతలు మానుకోకపోతే అల్మారాల్లోని అస్థిపంజరాలు బయటకొస్తాయి: 'సాక్షి'పై కుటుంబరావు ఫైర్

Kutumba Rao Fires at Sakshi Media Over Heritage Foods Allegations
  • హెరిటేజ్‌పై సాక్షి మీడియా ఆరోపణలు అవాస్తవమన్న కుటుంబరావు
  • టీటీడీకి హెరిటేజ్ ఎప్పుడూ నెయ్యి సరఫరా చేయలేదని స్పష్టీకరణ
  • భారతీ సిమెంట్ ధర పెంచినప్పుడు తప్పు కాదా అని ప్రశ్న
  • క్విడ్ ప్రో కో, ప్రజాధనంతో సాక్షికి లబ్ధి చేకూర్చారని విమర్శ
  • నీతిగా వ్యాపారం చేసే సంస్థపై బురద చల్లొద్దని హెచ్చరిక
హెరిటేజ్ ఫుడ్స్‌పై వైసీపీ, సాక్షి మీడియా చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, కల్పిత కథలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని స్వ‌ర్ణాంధ్ర పీ4 ఫౌండేష‌న్ వైస్ చైర్మ‌న్ పి. కుటుంబరావు తీవ్రంగా విమర్శించారు. ఒక పత్రికలో ప్రచురించిన కథనం కేవలం ఫిక్షన్ రైటింగ్ అని, అందులో వాస్తవాలు లేవని ఆయన కొట్టిపారేశారు. అబద్ధపు రాతలు మానుకోకపోతే సాక్షి యాజమాన్యం అల్మారాల్లోని అస్థిపంజరాలు బయటకు వస్తాయని, జైలు గడప తొక్కే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

హెరిటేజ్ సంస్థ తన చరిత్రలో ఏ ప్రభుత్వానికి, దేవాలయానికి నెయ్యి సరఫరా చేయలేదని కుటుంబరావు స్పష్టం చేశారు. కేవలం తమ బ్రాండ్‌పై నేరుగా వినియోగదారులకు మాత్రమే అమ్ముతుందని తెలిపారు. హెరిటేజ్ వెబ్‌సైట్ నుంచి ఒక ఫోటోను ఎడిట్ చేసి, ఇందాపూర్ డైరీలో నెయ్యి తయారవుతున్నట్లు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. ఇందాపూర్ డైరీ అనేది హెరిటేజ్‌కు ఒక 'కో-మాన్యుఫ్యాక్చరింగ్' యూనిట్ మాత్రమేనని, అక్కడ పాలు, పన్నీర్ వంటివి తయారవుతాయని, నెయ్యి ఉత్పత్తి జరగదని వివరించారు. బ్రిటానియా, హిందుస్థాన్ యూనిలివర్ వంటి దిగ్గజ సంస్థలకు ఉత్పత్తులు సరఫరా చేసే సోనాయ్ (ఇందాపూర్) డైరీపై సిండికేట్ ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు.

ద్రవ్యోల్బణం కారణంగా దేశవ్యాప్తంగా నెయ్యి ధరలు పెరిగాయని, ఈ వాస్తవాన్ని దాచిపెట్టి రాజకీయ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల క్రితం ధరలతో ఇప్పటి ధరలను పోల్చి దోపిడీగా చిత్రీకరించడం అజ్ఞానమని అన్నారు. "2014లో బస్తా రూ.250 ఉన్న భారతీ సిమెంట్ ధరను జగన్ రెడ్డి ఇప్పుడు రూ.430కి అమ్ముతున్నారు. అది తప్పు కానప్పుడు, డైరీ ఉత్పత్తుల ధరలు పెరగడం ఎలా తప్పవుతుంది?" అని ఆయన ప్రశ్నించారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేయని హెరిటేజ్, సిండికేట్ ఎందుకు అవుతుందని నిలదీశారు.

గత ఐదేళ్లలో రూ.600 కోట్ల ప్రభుత్వ ప్రకటనలతో నష్టాల్లో ఉన్న సాక్షిని ఎలా పోషించారో బ్యాలెన్స్ షీట్లు చూస్తే తెలుస్తుందన్నారు. "దేశంలో సాక్షి కంటే ఐదు రెట్లు పెద్ద పత్రికల మార్కెట్ విలువ రూ.1500 కోట్లు ఉంటే, 2008లోనే సాక్షికి రూ.3500 కోట్ల వాల్యుయేషన్ ఎలా వచ్చింది? ఇది క్విడ్ ప్రో కో, మనీ లాండరింగ్ కాదా?" అని కుటుంబరావు తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడి 'వల్లభ' నెయ్యి కూడా మార్కెట్‌లో అధిక ధరకే అమ్ముతున్నారని, దీనిపై సాక్షి ఎందుకు రాయదని ప్రశ్నించారు.

హెరిటేజ్ సంస్థ రైతులకు బాకీలు లేకుండా, ప్రభుత్వానికి పన్నులు సక్రమంగా చెల్లిస్తూ నీతిగా వ్యాపారం చేస్తోందని, ఇటీవలే భువనేశ్వరి గారికి ప్రతిష్ఠాత్మక 'గోల్డెన్ పీకాక్' అవార్డు వచ్చిందని గుర్తుచేశారు.

Kutumba Rao
Heritage Foods
Sakshi Media
YSRCP
Nara Bhuvaneswari
Golden Peacock Award
Andhra Pradesh Politics
TDP
Nellore Ghee
Indapur Dairy

More Telugu News