Thummala Nageswara Rao: సొమ్ములు మావి.. గొప్పలు మీవా?: కేంద్రంపై మంత్రి తుమ్మల ఫైర్

Thummala Nageswara Rao Fires at Central Govt Over Funds
  • తెలంగాణపై కేంద్రం తీవ్ర ఆర్థిక వివక్ష చూపుతోందన్న మంత్రి తుమ్మల
  • రాష్ట్రం నుంచి రూ.1.33 లక్షల కోట్లు తీసుకుని ఇచ్చింది రూ.51 వేల కోట్లేనని విమర్శ
  • ఆదాయం ఇచ్చే దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని ఆరోపణ
  • ఇది ఆర్థిక సమస్య కాదు, రాజకీయ కక్ష సాధింపేనని వ్యాఖ్య
కేంద్ర ప్రభుత్వం తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర ఆర్థిక వివక్ష చూపుతోందని, ఇది సమాఖ్య స్ఫూర్తిపై చేస్తున్న దాడి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు. "సొమ్ములు మావి… గొప్పలు మీవా?" అంటూ కేంద్ర వైఖరిని ప్రశ్నించిన ఆయన, రాష్ట్రం చెల్లించే పన్నులకు, కేంద్రం తిరిగి ఇచ్చే నిధులకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని గణాంకాలు సహా వివరించారు.

మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 2024-25లో తెలంగాణ నుంచి పన్నుల రూపంలో రూ.1,33,208 కోట్లు కేంద్రానికి వెళ్తే, కేంద్ర పథకాలతో కలిపి తిరిగి రాష్ట్రానికి వచ్చింది కేవలం రూ.51,725 కోట్లు మాత్రమేనని పార్లమెంట్ సాక్షిగా కేంద్రమే ఒప్పుకుందని తెలిపారు. దేశానికి అధిక ఆదాయం సమకూర్చే దక్షిణాది రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో కేంద్రం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. పన్ను రూపంలో చెల్లించే ప్రతి రూపాయికి దక్షిణాది రాష్ట్రాలకు సగటున 30 పైసలు ఇస్తుంటే, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ వంటి రాష్ట్రాలకు రూ.4 వరకు ఇస్తున్నారని, ఇది ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించడమేనని అన్నారు.

"ఇది కేవలం లెక్కల సమస్య కాదు. బలమైన రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచి, తమపై ఆధారపడేలా చేయాలనే రాజకీయ ఉద్దేశం ఇందులో కనిపిస్తోంది" అని తుమ్మల ఆరోపించారు. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని నిధులలో కోత పెడుతున్నారని విమర్శించారు. జీఎస్టీ సవరణల వల్ల రాష్ట్రం ఏటా రూ.8 వేల కోట్లు నష్టపోతోందని, 16వ ఆర్థిక సంఘం సిఫార్సులతో మరో రూ.5 వేల కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణకు జరుగుతున్న ఈ అన్యాయంపై రాష్ట్ర బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఏనాడూ ప్రశ్నించలేదని, పైగా తామే అన్నీ తెచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం నుంచి నిధులు రాకపోవడం వల్ల రైతు భరోసా, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాల అమలుకు ఆటంకాలు ఎదురవుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం ఫెడరల్ వ్యవస్థను గౌరవించి, తెలంగాణకు న్యాయమైన వాటా కేటాయించాలని, లేకపోతే 'వికసిత్ భారత్' నినాదంగానే మిగిలిపోతుందని తుమ్మల స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రంతో పోరాడటానికి బీజేపీ నేతలు కూడా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
Thummala Nageswara Rao
Telangana
Central Government
Financial Discrimination
South Indian States
Tax Revenue
Fund Allocation
BJP
GST
Federal System

More Telugu News