Jagan Mohan Reddy: జోగి రమేశ్ ఇంటికి నిప్పు... తీవ్రంగా స్పందించిన జగన్

Jagan Mohan Reddy Reacts Sharply to Attack on Jogi Ramesh House
  • అంబటి, జోగి రమేశ్ ఇళ్లపై దాడి వెనుక చంద్రబాబు ఉన్నారని జగన్ ఆరోపణ
  • తప్పుడు ఆరోపణలు రుజువవడంతో జీర్ణించుకోలేకే ఈ దాడులని విమర్శ
  • రాష్ట్రంలో అరాచక, ఆటవిక పాలన సాగుతోందని వ్యాఖ్య
  • ఈ నిప్పు చంద్రబాబు ప్రభుత్వాన్నే దహించివేస్తుందని హెచ్చరిక
ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై జరిగిన దాడుల వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అరాచక, ఆటవిక పాలన సాగుతోందని, ఇది 'జంగిల్ రాజ్' కు నిదర్శనమని ధ్వజమెత్తారు.

గతంలో వైసీపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు తప్పని కేంద్ర ప్రభుత్వ ల్యాబ్ లు ఎన్‌డీడీబీ (NDDB), ఎన్‌డీఆర్‌ఐ (NDRI) నివేదికలు నిర్ధారించాయని గుర్తుచేశారు. ఈ నిజాన్ని ప్రశ్నించినందుకే జీర్ణించుకోలేక అంబటి, జోగి రమేశ్ ఇళ్లపై దాడులు చేయించి నిప్పు పెట్టించారని ఆరోపించారు. "ఈ దుశ్చర్యలతో భయాన్ని కలిగించానని మీరు అనుకోవడం మీ భ్రమే. ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరే పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలి" అని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఈ దాడులు ప్రజాస్వామ్యంపై రగిల్చిన మంటల వేడి, చంద్రబాబు సర్కారును దహించివేయక మానదని జగన్ హెచ్చరించారు. రానున్న కాలంలో ప్రజాగ్రహ జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసి, ప్రభుత్వాన్ని బూడిద చేస్తాయని అన్నారు. "చరిత్ర చెప్పే సత్యం ఒక్కటే. హింసా జ్వాలలను రగిల్చే చేయి కాలక తప్పదు, అరాచక పాలన అంతం కాక తప్పదు. మీరు సృష్టించిన ‘జంగిల్ రాజ్’ భూస్థాపితం కావడం ఖాయం" అని జగన్ పేర్కొన్నారు.


Jagan Mohan Reddy
Jagan
YS Jagan
Andhra Pradesh Politics
Chandrababu Naidu
YSRCP
TDP
Jogi Ramesh
Ambati Rambabu
Political Violence

More Telugu News