Rythu Bharosa: రైతు భరోసాకు కొత్త రూల్స్.. ఇకపై సాగు చేసేవారికే పెట్టుబడి సాయం

Rythu Bharosa New Rules Investment Assistance Only for Cultivators
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతోంది. యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని సంక్రాంతి పండుగ కానుకగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. అయితే, ఈసారి పథకం అమలులో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. కేవలం పంటలు సాగు చేసే నిజమైన రైతులకే ప్రయోజనం చేకూరేలా పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది.

గతంలో సాగు చేయని భూములకు కూడా నిధులు అందుతున్నాయన్న విమర్శల నేపథ్యంలో, ఈసారి ప్రభుత్వం టెక్నాలజీ సాయం తీసుకుంటోంది. ఉపగ్రహ చిత్రాల ద్వారా వ్యవసాయ భూములను క్షుణ్ణంగా పరిశీలించి, డిజిటల్ మ్యాపింగ్ ద్వారా ఏ పొలంలో పంట ఉందో, ఏది ఖాళీగా ఉందో గుర్తిస్తున్నారు. దీనివల్ల సాగులో లేని బంజరు భూములు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు భరోసా నిలిచిపోనుంది. ఈ చర్యతో ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గడమే కాకుండా, అర్హులైన రైతులకే లబ్ధి చేకూరుతుంది.

ప్రస్తుత బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ పథకానికి రూ. 18,000 కోట్లు కేటాయించింది. గత వానాకాలం సీజన్‌లో సుమారు 69 లక్షల మంది రైతులకు రూ. 9,000 కోట్లను కేవలం 9 రోజుల్లోనే జమ చేసింది. ఇప్పుడు యాసంగికి కూడా జనవరి రెండో వారం నాటికి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి, పండుగలోపు నిధులు పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.


Go Back to Shorts
Rythu Bharosa
Telangana farmers
Farmer investment scheme
Agriculture technology
Digital mapping
Sankranti gift
Crop cultivation
Agricultural land verification
Telangana government
Yasangi season

More Telugu News